సీఎం 'యోగి' ఎఫెక్ట్: హోటళ్లపై దాడులు.. అదుపులో 50జంటలు
ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంతంలో ఉన్న రెండు హోటళ్లపై భారీ ఎత్తున దాడులు నిర్వహించారు.
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యూపీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు పలు హోటళ్లపై దాడులు చేశారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంతంలో ఉన్న రెండు హోటళ్లపై భారీ ఎత్తున దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో దాదాపు 50జంటలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హోటళ్లలో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని కొత్వాలీ స్టేషన్ కు తరలించారు.
దాడుల్లో పట్టుబడ్డ యువతీ యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి న్యాయపరమైన చర్యల గురించి వివరించారు. దాడులు నిర్వహించిన రెండు హోటళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ రెండు హోటళ్ల యజమానులు ఢిల్లీ-ఎన్సీఆర్ మార్గంలో కస్టమర్లను ఆకర్షించి గంటల చొప్పున గదులను అద్దెకిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోను ఈ హోటళ్లపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం యోగి ఆదిత్యానాథ్ పోలీసులకు పూర్తి స్వేచ్చనిట్లు సమాచారం.