రైతుల ట్రాక్టర్ ర్యాలీ : ఆ నోటీసులు వెనక్కి తీసుకున్న పోలీసులు... పొరపాటున జరిగిందని...
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. రెండు నెలలకు పైగా సాగుతున్న రైతుల ఆందోళనలు ట్రాక్టర్ ర్యాలీతో మరింత ఉధృతంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకునే చర్యలకు ఉపక్రమించిన పోలీసులు వెనక్కి తగ్గారు. రైతుల ట్రాక్టర్లలో డీజిల్ పోయొద్దని పెట్రోల్ బంకులకు నోటీసులిచ్చిన సుహ్వాల్ పోలీసులు వాటిని ఉపసంహరించుకున్నారు. ఇది పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు.
Recommended Video
ట్రాక్టర్లకు లేదా బాటిళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ పోయొద్దని స్థానిక పెట్రోల్ బంకుల్లో పోలీసులు నోటీసులు అంటించారు. 'జనవరి 26,2021 నాడు రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించాం. ఆరోజు సెక్షన్ 144 అమలులో ఉంటుంది. ట్రాక్టర్ ర్యాలీలతో పాటు రైతుల నుంచి ఇతరత్రా నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండటంతో ట్రాక్టర్ల రాకపోకలు నిషేధాజ్ఞలు అమలవుతాయి. కాబట్టి 22.0.2021 నుంచి 26.01.2021 వరకూ మీరు(పెట్రోల్ బంక్ నిర్వాహకులు) ట్రాక్టర్లకు డీజిల్ పోయొద్దు. ఖాళీ బాటిళ్లలోనూ డీజిల్ నింపవద్దు. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే అందుకు మీరు బాధ్యులవుతారు.' అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ తమ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వార్తను షేర్ చేసింది. 'జనవరి 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనకుండా చేసేందుకు యూపీ పోలీసులు రైతులనుహ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు,ట్రాక్టర్లకు డీజిల్ ఇవ్వొద్దని పెట్రోల్ బంకులకు ఆదేశాలిచ్చారు. ఇది కార్పోరేట్లకు వత్తాసు పలకడమే. గుడ్డి విధానాలతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం రైతులపై అన్ని రకాల దారుణాలకు పాల్పడుతోంది.' అని ఆ పార్టీ పేర్కొంది.
Farmers, with their tractors, continue to gather at Ghazipur border (UP-Delhi border) ahead of their proposed Tractor Rally tomorrow. #FarmLaws pic.twitter.com/nFgBvpdLKV
— ANI UP (@ANINewsUP) January 25, 2021
కాగా,కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రైతులతో కేంద్రం 11 దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించగా... రైతులు మాత్రం వాటి రద్దునే డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను తాత్కాలికంగా పక్కనపెడుతామని చెప్పడం మోసపూరిత చర్యేనని విమర్శిస్తున్నారు.