గ్రేటర్లో బీజేపీ గెలిస్తే.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే: ఆ పేరు విస్తృతంగా ట్రెండ్.. కానీ!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్లలో అనూహ్యంగా భారీ ఆధిక్యతను కనపరిచిన భారతీయ జనతా పార్టీ.. అసలు కౌంటింగ్లోకి వచ్చేటప్పటికి చతికిల పడింది. పోస్టల్ బ్యాలెట్లలో వెనుకంజలో నిలిచిన కారు గేరు మార్చింది.. టాప్ స్పీడ్తో దూసుకెళ్తోంది. బీజేపీ రెండోస్థానానికి దిగజారింది. మేయర్ పదవిని అందుకోవడానికి అవసరమైన స్థానాలను సింగిల్గా తన ఖాతాలో వేసుకునే అవకాశాలు టీఆర్ఎస్కు దక్కేలా ఉంది పోలింగ్ ట్రెండ్.
GHMC Exit Polls అంచనా తలకిందులవుతాయా: ప్రారంభ ఫలితాల్లో కమల వికాసం: స్పీడు తగ్గిన కారు
బీజేపీ నేతలు తొందరపడ్డారా?
రౌండ్ రౌండకూ ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కనపరుస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం యావత్ దేశాన్ని ఆకర్షించింది. కమలనాథులు భారీ మెజారిటీతో దూసుకెళ్లడం పట్ల బీజేపీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. దీనితో బీజేపీ జాతీయ స్థాయి నాయకులు తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులను అభినందించడం కూడా మొదలు పెట్టారు. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్..ఓ అడుగు ముందుకేశారు.
భాగ్యనగర్ పేరుతో
వెల్డన్ భాగ్యనగర్.. అంటూ ప్రశంసించారు. గ్రేటర్ హైదరాబాద్ విభాగం బీజేపీ నాయకులకు ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. భాగ్యనగర్ అనే పేరును సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. #Bhagyanagar అనే పేరు మీద పెద్ద ఎత్తున సెర్చ్ నడిచింది. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఈ హ్యాష్ట్యాగ్తో ట్వీట్లను సోషల్ మీడియాలో గుమ్మరించేశారు. తెలంగాణ బీజేపీ నేతలపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
పేర్లు మార్పుపై
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామని బీజేపీ నేతలు ఎన్నికల ప్రచార సందర్భంగా ఇచ్చిన హామీని పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. పార్టీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భాగ్యనగర్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లో చారిత్రక నేపథ్యం కలిగిన కొన్ని నగరాలకు తాము భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పేర్లను మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆశలు అడియాసలే..
గ్రేటర్ ఎన్నికల్లో తాము మేయర్ పీఠాన్ని అందుకోగలిగితే.. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా బదలాయిస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ కనిపరిచిన దూకుడు.. అసలు ఓట్ల లెక్కింపులో కనిపించకపోవడంతో.. వారి ఆశలు అడియాసలైనట్టే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సింగిల్గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా బాటలు వేసుకుంది. అనూహ్యంగా బలపడింది టీఆర్ఎస్. బీజేపీకి గట్టిపట్టు ఉన్న స్థానాల్లోనూ ఆధిక్యతలో కొనసాగుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు.
Recommended Video