దయ్యాలనే అమ్మేశాడు: కటకటాలపాలయ్యాడు
రాయ్పూర్: గ్రామీణ ప్రజల మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. అలాంటి ఇలాంటి మోసం కాదు, ఏకంగా దయ్యాలనే వారికి అమ్మేశాడు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన కొందరు.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ కొత్త రకం మోసం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీగఢ్లోని జష్పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామస్తులు దయ్యలున్నాయని నమ్మతారు. వారి ఈ నమ్మకాన్నే తన పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి.
తన దగ్గర దయ్యాలు ఉన్నాయని, వాటిని కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందని పేర్కొంటూ వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. దయ్యాలు కనపడవు కనుక నిరూపించాల్సిన అవసరం లేదు. దయ్యాలే లేవు, నీదంతా బూటకపు వ్యాపారం అని ఎవరైనా నిలదీస్తే కనుక, దయ్యాలున్న విషయం హనుమాన్ ఛాలీసాలో ఉంది చూసుకోండని వారికి చెబుతాడు.
గ్రామస్తుల అవసరాలు కనిపెట్టి, వారిని భయపెట్టి, ఇలా లేని దయ్యాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.
కాగా, ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అవాక్కైన పోలీసులు, నిజంగా దయ్యాలను అమ్ముతున్నాడని నిర్ధారించుకున్న తర్వాత.. నారాయణ్ యాదవ్, అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.