ఆరెస్సెస్ను ఐసిస్తో పోల్చిన ఆజాద్, దుమారం
న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో పలు దేశాలను వణికిస్తున్న ఇస్లామిస్ స్టేట్కు (ఐసిస్), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్కు (ఆరెస్సెస్)కు మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శనివారం నాడు పోలిక తెచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, ఆజాద్ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
ఆరెస్సెస్ను ఉగ్రవాద సంస్థ ఐసిస్తో ఆజాద్ పోల్చడంతో ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఆరెస్సెస్ మండిపడింది. ఆజాద్ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలకు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని బిజెపి డిమాండ్ చేసింది.
ఢిల్లీలో జమైత్ ఉలామా ఈ హింద్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆజాద్ శనివారం మాట్లాడారు. మనం ఆరెస్సెస్ మాదిరిగానే ఐసిస్నూ వ్యతిరేకించాలని, ఇస్లాంలో ఉన్నవారు తప్పుడు పనులు చేస్తే వారు ఆరెస్సెస్తో సమానమని వ్యాఖ్యానించారు.
దీనికి ఆరెస్సెస్ నేత జె నంద్ కుమార్ మాట్లాడుతూ.. ఐసిస్ వంటి క్రూర సంస్థల్లో మత ఛాందసవాదంతో ఎలా వ్యవహరిస్తారో తెలియని కాంగ్రెస్ భావ దారిద్య్రానికి ఇది నిదర్శనమన్నారు. ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ.. ఆయన క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
ఆజాద్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని, లేనిపక్షంలో అతనిపై చర్యలు తీసుకోవాలని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. ఆరెస్సెస్ ఒక జాతీయ సంస్థ.. దానిపై వ్యాఖ్యలు ఆజాద్ దివాళాకోరుతునాన్ని సూచిస్తున్నాయన్నారు.