నోట్ల రద్దు: ఆజాద్ తీవ్ర వ్యాఖ్య, పాక్ ఉగ్రవాదంతో పోల్చడమా: వెంకయ్య
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పైన పార్లమెంటు గురువారం దద్దరిల్లింది. వరుసగా రెండో రోజు ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని యూరి ఉగ్రదాడి ఘటనతో పోల్చారు. దీంతో సభ వేడెక్కింది.
ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా యూరి ఘటనలో కంటే నోట్ల రద్దు వల్ల రెట్టింపు మంది చనిపోయారని ఆరోపించారు. 40 మంది అమాయక, నిరాధార రైతులు, కూలీలు, పేదలు పెద్ద నోట్ల రద్దు కారణంగా మరణించారన్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య కౌంటర్ ఇచ్చారు.
ఆజాద్ చాలా పెద్ద తప్పు చేశారని, పాకిస్థాన్కు ధృవపత్రం ఇచ్చారని, ఇది అభ్యంతరకరమైనదని, ప్రతిపక్ష నేత జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను పాకిస్థాన్ వినియోగించుకుంటుందని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్లోని వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందని, నోట్ల రద్దు అంశాన్ని పాక్ ఉగ్రవాదంతో పోలుస్తారా అని నిలదీశారు. అలా చేసి పాకిస్థాన్ను కాపాడాలనుకుంటున్నారా అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నామని, ఆయన వ్యాఖ్యలను దేశమంతా వ్యతిరేకిస్తోందన్నారు.
ఆజాద్ వ్యాఖ్యల పైన కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యసభ వాయిదాపడిన తర్వాత వెంకయ్య తన ఛాంబరులో కేంద్రమంత్రులతో ఈ విషయమై చర్చించారు. ఆజాద్ నుంచి వివరణ కోసం పట్టుబట్టాలని అధికార పక్షం నిర్ణయించింది. సభ సాక్షిగానే ఆజాద్ నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు.