తగ్గిన ఆజాద్: రాయల వద్దు, టిపై జివోఎంకు సిఫార్సు
న్యూఢిల్లీ: రాయల తెలంగాణపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తగ్గినట్లుగా కనిపిస్తోంది. పది జిల్లాల తెలంగాణకే సిఫార్సు చేయాలని జివోఎం సహచరులకు ఆజాద్ సూచించినట్లుగా తెలుస్తోంది. మొదట జివోఎం సభ్యులు హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు మొగ్గు చూపారు.
అయితే వారం రోజులు క్రితం ఆజాద్ సూచనల మేరకు రాయల తెలంగాణ తెరపైకి వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెసి దివాకర్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వంటి కొందరు రాయలసీమ నేతలు మినహా తెలంగాణ, రాయలసీమ నేతలు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆజాద్ తగ్గి ఉంటారని అంటున్నారు. ఇందుకు సంబంధించి పది జిల్లాల తెలంగాణకే సిఫార్సు చేయాలని జివోఎం సహచరులకు ఆజాద్ సూచించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తేనే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చునని, లేకుంటే కొత్త సమస్యలకు దారి తీసినట్లవుతుందని వివరించారట. సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడాలని సూచించినట్లుగా సమాచారం. బుధవారం సాయంత్రం ఆజాద్ సిఫార్సు చేశారని తెలుస్తోంది. అయితే తెలగాణ, రాయల తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని జివోఎం కేబినెట్కు వదిలేసినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో అనుమానమే
ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు అనుమానమేనని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ వేరుగా అన్నారు. తాము రాయల తెలంగాణను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.