బీజేపీ పాలనలో ఉండటం కంటే చంద్రమండలమే బెటర్: టికెట్ కొనివ్వండి.. అక్కడికే వెళ్లిపోతా!
తిరువనంతపురం: ప్రముఖ మలయాళీ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీ పాలనలో కొనసాగుతున్న భారత్లో నివసించడం కంటే చంద్రమండలానికి వెళ్లడమే అత్యుత్తమమని అన్నారు. బీజేపీ నాయకులు ఎవరైనా చంద్రునిపై తన కోసం ప్రత్యేకంగా ఓ గదిని చూసి పెట్టాలని ఆయన కోరారు. అలాగే- చంద్రుని మీదికి వెళ్లడానికి అవసరమైన టికెట్ను కొనివ్వాలని ఆయన బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మత విధ్వేషం పెరుగుతోందని, జై శ్రీరామ్ అనే నామజపం ఓ యుద్ధ నినాదంగా మారిందని ఆయన పునరుద్ఘాటించారు.
దేశంలో మతద్వేషం పెచ్చరిల్లుతోందని, మైనారిటీలపై దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని అంటూ ఇటీవలే బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ 49 మందిలో ఆదూర్ గోపాలకృష్ణన్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కశ్యప్, కొంకణాసేన్ శర్మ వంటి వారు ఈ 49 మందిలో ఉన్నారు. వారంతా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనికి కౌంటర్గా 61 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి అండగా నిలిచారు. జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదులు విచ్చలవిడిగా దాడులు చేస్తే ప్రాణాలను హరిస్తున్న సమయంలో ఈ సోకాల్డ్ మేధావులంతా ఏం చేశారని నిలదీశారు.
ఇదిలావుండగా.. ప్రధానికి నిరసన వ్యక్తం చేస్తూ లేఖ రాసిన వారిలో ఒకరైన ఆదూర్ గోపాలకృష్ణన్ను టార్గెట్గా చేసుకున్నారు కేరళకే చెందిన బీజేపీ నేత గోపాలకృష్ణన్. ఎవరైనా సరే.. జై శ్రీరామ్ అనే నినాదాన్ని చెవులారా వినాల్సిందేనని అన్నారు. అలా వినలేని వాళ్లెవరైనా ఈ దేశంలో నివసించడానికి అనర్హులని ఆదూర్ గోపాలకృష్ణన్ను ఉద్దేశించి చెప్పారు. అలాంటి వాళ్లంతా చంద్రమండలానికి వెళ్లిపోవాలని సూచించారు.
Filmmaker Adoor Gopalakrishnan on a BJP leader asking him to go to the moon if he can't tolerate 'Jai Sri Ram' slogans: It is a good suggestion by this BJP friend that I should go to the moon, if he can book a room for me on moon and buy me a ticket then it will be a nice stay pic.twitter.com/eUcY76zrxA
— ANI (@ANI) July 26, 2019
దీనిపై ఆదూర్ గోపాలకృష్ణన్ తనదైన శైలిలో స్పందించారు. తనను చంద్రమండలానికి వెళ్లాలని బీజేపీకి చెందిన స్నేహితుడొకరు మంచి సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో నివసించడం కంటే చంద్రుడి మీదికి వెళ్లడమే ఉత్తమం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రుడి మీద తనకు ఓ గది చూసిపెట్టాలని కోరారు. అలాగే అక్కడికి వెళ్లడానికి టిక్కెట్టు కొనిపెట్టాలని, అలా చేస్తే- సంతోషంగా వెళ్తానని ఆదూర్ గోపాలకృష్ణన్ కౌంటర్ ఇచ్చారు.
ప్రశ్నించిన వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించడం సరికాదని విమర్శించారు. ఇది బీజేపీ నాయకుల అసహనానికి ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఇలా ఎంతమందిని చంద్రుడి మీదికి పంపిస్తారని ప్రశ్నించారు. ఈ సమాజంలో, ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికీ ఉందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుక చర్యలపై ఎందుకు స్పందించ లేదని వారు తమను ప్రశ్నిస్తున్నారని, అన్నింటికీ స్పందించడానికి, వ్యాఖ్యానించడానికి తామేమీ ప్రొఫెషనల్ కామెంటేటర్లు కాదని ఆదూర్ అన్నారు.