హిందువులను మాత్రమే ప్రభుత్వం అరెస్టు చేస్తోంది: గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
జార్ఖండ్లో ఆవు మాంసం విక్రయిస్తున్నందుకే ఒక వ్యక్తిని ఎనిమిది మంది గోరక్షకులు హత్యచేయడాన్ని వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలపాలయ్యారు. ఆ ఘటన మరవక ముందే సమాజంలో మతఘర్షణలకు పాల్పడిన బజరంగ్ దళ్, వీహెచ్పీ కార్యకర్తలను బీహార్లోని నవాడా జైలుకు వెళ్లి పరామర్శించారు మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. అయితే బీజేపీ మిత్రపక్షం అధికార జేడీయూ మాత్రం గిరిరాజ్పై విమర్శలు గుప్పించింది. జైలులో వారంతా శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించారని అలాంటి వారిని అన్యాయంగా ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టిందని గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు కేవలం హిందువులను మాత్రమే అరెస్టు చేయడం వల్ల శాంతి నెలకొంటుందని ప్రభుత్వం భావించడం దురదృష్టకరమన్నారు.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పందించారు. సర్వమతాల వారికి బీహార్లో ఉన్నంత స్వేచ్ఛ, భద్రత దేశంలో మరే రాష్ట్రంలో లేదని త్యాగి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యవస్థలో ఘర్షణ వాతావరణానికి దారితీస్తాయని త్యాగి అన్నారు. అంతేకాదు అల్లర్ల కేసులో జైలులో ఉన్న వ్యక్తులను మంత్రి కలిసి అరగంటపాటు గడపడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు.
2017లో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా నవడా జిల్లాలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో అల్లర్లు చెలరేగడానికి కారణం బజరంగ్ దళ్ నేత జితేంద్ర ప్రతాప్, కైలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని జూలై 3,2017లో అరెస్టు చేయడం జరిగింది.వీరి అరెస్టు తర్వాత మరుసటి రోజు అంటే జూలై 4న నవడా జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పాలనాయంత్రాంగం ఈ కేసును పునర్విచారించి వేగవంతమైన విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.