ఒవైసీది జిన్నా మైండ్ సెట్: మజ్లిస్ విజయం..ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: కేంద్రమంత్రి
పాట్నా: బిహార్ లోని కిషన్ గంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐఎంఐఎం అభ్యర్థి విజయం సాధించడం పట్ల కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ అభ్యర్థి గెలుపు ప్రజస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉప ఎన్నికల్లో తాము ఇచ్చిన తీర్పు పట్ల కిషన్ గంజ్ ప్రజలు పునరాలోచించుకోవాలని, మరోసారి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదని చెప్పారు.
ఈ మేరు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి ఫలితాలు బిహార్ లో పునరావృతం కానివ్వకూడదని అన్నారు. మజ్లిస్ వంటి భావజాలం ఉన్న మతతత్వ పార్టీలకు ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచించారు. బిహార్ లోని కిషన్ గంజ్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అభ్యర్థి కమ్రూల్ హొడా విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతాపార్టీకి చెందిన స్వీటీ సింగ్ పై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. కమ్రూల్ కు 70, 469 ఓట్లు పోల్ రాగా.. స్వీటీ సింగ్ కు 60, 258 ఓట్లు పడ్డాయి. ఈ తరహా ఫలితాన్ని బీజేపీ ఏ మాత్రం ఊహించ లేదు. బీజేపీ మిత్రపక్షం, ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్ లో పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడం గిరిరాజ్ సింగ్ ను ఆందోళనకు గురి చేసింది.
बिहार के उपचुनाव में सबसे ख़तरनाक परिणाम किशनगंज से उभर के आया है ..ओवैसी की पार्टी AIMIM जिन्ना की सोच वाले है ,यें वंदे मातरम से नफरत करते है ,इनसे बिहार की सामाजिक समरसता को खतरा हैं।
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) October 25, 2019
बिहार वासियों को अपने भविष्य के बारे में सोचना चाहिए।
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మహమ్మద్ అలీ జిన్నా భావజాలాన్ని అనుసరిస్తున్నారని గిరిరాజ్ సింగ్ చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ గానీ, ఆయన సారథ్యం వహిస్తోన్న ఏఐఎంఐఎం గానీ.. వందేమాతరం గేయాన్ని ధ్వేషిస్తారని అన్నారు. బిహార్ లో మత సామరస్యానికి, ప్రజాస్వామ్య విలువలకు మజ్లిస్ గెలుపు విఘాతంలా పరిణమిస్తాయని చెప్పారు.
ఇలాంటి సున్నితమైన అంశాలపై బిహార్ ప్రజలు గానీ, కిషన్ గంజ్ ఓటర్లు గానీ.. ఒకటిరి రెండు సార్లు ఆలోచించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోనివ్వకూడదని అన్నారు. ఒవైసీకి దేశం పట్ల భక్తి భావం ఏ మాత్రం లేదని, ఆయన పార్టీ నాయకులు జాతీయ గీతాన్ని సైతం గౌరవించరని అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.