విద్యార్థి నేత కన్హయకుమార్పై ఈయన ఎంత మెజార్టీతో గెలిచారో తెలుసా..?
బెగుసరాయ్ : దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి పలు కీలక సీట్లపై అందరి దృష్టి పడింది. అందులో ఒకటి బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున జేఎన్యూ విద్యార్థి నేత కన్హయకుమార్ బరిలో నిలిచారు. అయితే ఆయన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. క్యాంపస్ పాలిటిక్స్లో విజయం సాధించిన కన్హయ కుమార్ ప్రజాక్షేత్రంలో మాత్రం విజయం సాధించలేకపోయారు.
గిరిరాజ్ సింగ్ 2014లో నవాడా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఆయన బెగుసరాయ్ నుంచి బరిలో దిగారు. ఇష్టం లేకున్నప్పటికీ బీజేపీ అధిష్టానం బలవంతంతో ఆయన బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు.బెగుసరాయ్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ... అక్కడి ప్రజలు మాత్రం గిరిరాజ్ సింగ్ను ఇష్టపడ్డారు. బెగుసరాయ్ నుంచి ఆయనకు పోలైన ఓట్లు 6.92 లక్షలు. ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికలో మొత్తం 12.17 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక కన్హయ కుమార్కు అక్కడ పోలైన ఓట్లు 2.7 లక్షల మాత్రమే. అంటే గిరిరాజ్ సింగ్ ఏకంగా 4.22 లక్షల ఓట్లు తేడాతో విజయం సాధించారు.
ఇక రాష్ట్రీయ జనతాదల్ అభ్యర్థి మొహ్మద్ తన్వీర్ హసన్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక బెగుసరాయ్లో 20వేల మంది నోటాకు ఓటు వేశారు. మహాకూటమిలో భాగంగా కన్హయకుమార్ను ముందుగా బెగుసరాయ్ స్థానం నుంచి పోటీచేయించాలని భావించినప్పటికీ ... భూమిహర్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు యాదవులు, ముస్లింల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించింది. వేరొక స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉండటంతో సీపీఐ దీన్ని వ్యతిరేకించింది. ఆర్జేడీ కూడా దిగిరాకపోవడంతో సీపీఐ తెగదెంపులు చేసుకుని ఒంటరిగానే బెగుసరాయ్ నుంచి పోటీచేసింది. కమ్యూనిస్ట్ భావజాలం ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువగానే ఉంటుందని భావించిన సీపీఐకు ఓటమి షాక్ ఇచ్చింది.
గిరిరాజ్ సింగ్ గెలిచారన్న వార్త బయటకు రాగానే బీజేపీ, సీపీఐల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బెగుసరాయ్లోని సీపీఐ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు బాణా సంచా పేల్చడంతో గొడవ ప్రారంభమైంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ తరపున బోలా సింగ్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో 55 వేల ఓట్ల మెజార్టీతో ఆర్జేడీ అభ్యర్థి మొహ్మద్ తన్వీర్ ఓటమిపాలయ్యారు.