సోనియాగాంధీ తెల్లతోలు: తగ్గిన గిరిరాజ్, మోడీ క్షమాపణ చెప్పాలని..
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు, గిరిరాజ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ చెబుతోంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ.. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవి ఖండించదగ్గవన్నారు. గిరిరాజ్ సింగ్ కేంద్రమంత్రిగా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఆయన ప్రధాని తప్పనిసరిగా స్పందించాలన్నారు.
నొచ్చుకుంటే చింతిస్తున్నా: గిరిరాజ్
తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా మనస్తాపం చెందితే క్షమించాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. తన వ్యాఖ్యల పైన విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన స్పందించారు. చాలా విషయాలు ఆఫ్ ది రికార్డ్గా అంటుంటారని, కానీ తన వ్యాఖ్యలు రాహుల్ గాంధీని లేదా సోనియా గాంధీని బాధపెట్టి ఉంటే చింతిస్తున్నానని చెప్పారు.
అదుపులో ఉండండి: బీజేపీ
గిరిరాజ్ వ్యాఖ్యల పైన బీజేపీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పింది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, మాట్లాడేటప్పుడు ఆలోచించాలని సూచించింది. పరిపాలన, అభివృద్ధి పైనే దృష్టి సారించాలని సూచించింది.
కాగా, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తీవ్ర పదజాలం ఉపయోగించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ నైజీరియన్ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.
రాజీవ్ గాంధీ కనుక నైజీరియన్ను పెళ్లి చేసుకొని ఉంటే, ఆమెకు తెల్ల తోలు ఉండకపోయేదని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను లీడర్గా అంగీకరించేవారా అని వ్యాఖ్యానించారు. కాగా, గిరిరాజ్ సింగ్ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కూడా కామెంట్ చేశారు.