అప్పుడే ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపించాల్సింది.. కేంద్రమంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 1947లో ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపించి ఉండాల్సిందని.. మన పూర్వీకులు చేసిన తప్పు కారణంగా మనం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. తన తోటి భరత వంశీయులంతా భారతదేశ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉండాలని చెప్పిన గిరిరాజ్.. 1947 కంటే ముందే జిన్నా చేసిన 'ఇస్లామిక్ నేషన్' ప్రతిపాదనను గుర్తుచేశారు. బీహార్లోని పుర్ణియాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గిరిరాజ్ మాట్లాడారు.
ఆ సమయంలో ముస్లిం సోదరులందరినీ పాకిస్తాన్ పంపించి.. అక్కడి హిందు సోదరులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఈరోజు దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఒకవేళ భరతవంశీయులకు ఇక్కడ ఆశ్రయం కల్పించకపోతే.. వారు ఇంకెక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్ను ఉగ్రవాద గంగోత్రిగా గిరిరాజ్ సింగ్ అభివర్ణించడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. హఫీజ్ సయిద్ సహా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా దేవ్బంద్ నుంచే పుట్టుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గిరిరాజ్ సింగ్ను ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి పిలిచి మందలించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయబట్టే ఓటమి చవిచూశామని.. మరికొద్ది నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.