రాహుల్ గాంధీకి ఎప్పుడు పారిపోవాలో బాగా తెలుసు: కేంద్ర మంత్రి ఎద్దేవా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యంత కీలక సమయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను వదిలేసి వెళ్లిపోతుంటారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎద్దేవా చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడి సంగతి తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలను బీజేపీ దాని మిత్రపక్షాలు కైవసం చేసుకోగా, మేఘాలయను హస్తం తన హస్తగతం చేసుకుంది.
అయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే కీలక సమయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. 'ఇలాంటి సమయంలో కార్యకర్తలను వదిలేసి ఏ నాయకుడూ ఇలా పారిపోడు. రాహుల్ గాంధీ శ్రద్ధ లేని అధ్యక్షుడు..' అని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ అంతకుముందు ఓసారి 56 రోజులపాటు ఇలాగే అదృశ్యమైపోయారని, ఇప్పుడు మరోసారి మాయమైపోయారని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇలాంటి సమయాల్లో తనవారికి ఎవరూ ఈ విధంగా చెయ్యి ఇవ్వరని, వారితోనే కలిసి ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు.
అంతేకాదు, రాహుల్ గాంధీ ఒత్తిడిని ఎదుర్కొనలేరని, ఒత్తిడి సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియదని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయనకు ఎప్పుడు పారిపోవాలో బాగా తెలుసునంటూ ఎగతాళి చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు తమ పార్టీకి అధ్యక్షుడిని చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ సహజమైన నాయకుడు కాదని, ఏదో పరిస్థితుల కారణంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ హోలీ పండుగ సందర్భంగా తన అమ్మమ్మను కలిసేందుకు ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. తాను ఇటలీ వెళుతున్నానని ఆయన చెప్పే వెళ్లారు.