మెట్రో రైలు కింద దూకి యువతి ఆత్మహత్యాయత్నం
ఫరీదాబాద్: ఓ 20ఏళ్ల యువతి మెట్రో రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. బదార్పూర్-ఎస్కార్ట్స్ ముజేసర్ కారిడార్ మధ్య బాట చౌక్ స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు కింద దూకడంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
మంగళవారం ఉదయం 11.45గంటలకు బాట చౌక్ స్టేషన్లో రైలు కోసం వేచివున్నట్లుగా ఉన్న ఆ యువతి.. హఠాత్తుగా కదులుతున్న ఓ రైలు కింద దూకింది. దీంతో ఆమెను రైలు కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
గమనించిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించారు. రైలు కింద పడిన ఆ యువతిని కాపాడగలిగారు. అయితే ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆమె ఎడమ చేయిని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
అయితే ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో తెలియరాలేదు. బాధిత యువతి పేరు పూనం అని, ఆమె ఫరీదాబాద్లోని బల్లాబ్గార్ సెక్టార్-3లో నివాసి అని పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.