ఘోరం: బతికుండగానే యువతిని పాతిపెట్టారు, ప్రైవేట్ భాగాల్లో కారం..(వీడియో)
బీహార్ రాష్ట్రంలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలతో ఉండగానే ఓ 19 ఏళ్ల యువతిని భూమిలో పూడ్చి పెట్టారు కొందరు దుర్మార్గులు. ఈ ఘటన గోవిందపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పాట్నా: బీహార్ రాష్ట్రంలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలతో ఉండగానే ఓ 19 ఏళ్ల యువతిని భూమిలో పూడ్చి పెట్టారు కొందరు దుర్మార్గులు. ఈ ఘటన గోవిందపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. స్థానిక వ్యాపారి అమిత్ షా.. బాధిత యువతి తల్లిదండ్రులు సంజన, అన్సారీలను వారి స్థలంలో ఓ భవనం కడతానని ప్రతిపాదించారు. దానికి వారు అంగీకరించలేదు.
దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించారు. ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో.. ముగ్గురు దుండగులతో దాడి చేయించారు. ఆ తర్వాత వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను తీవ్రంగా కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు.
ఖుష్బూ ఇంట్లో కనిపించకపోయేసరికీ అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపడింది. దీంతో గ్రామస్తుల సాయంతో ఆమెను బయటికి తీసి, హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఖుష్బూ ప్రవేటు భాగాల్లో కారం చల్లిన నిందితులు ఆమెను తీవ్రంగా హింసించినట్లు తెలిసింది. ఘటనలో ప్రధాన నిందితుడు అమిత్ షాతోపాటు మరో ముగ్గురు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. కాగా, ఖుష్బూను గుంత నుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.