చంపేశారా...చనిపోయిందా: కోల్కతా స్కూలులో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కోల్కతా: కోల్కతాలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జీడీ బిర్లా స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని అచేతన స్థితిలో పడిఉండటం చూస్తే ఎవరో ఆమెను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మణికట్టుకోసి, ప్లాస్టిక్ బ్యాగుతో తన ముఖానికి చుట్టి అచేతన స్థితిలో బాత్రూంలో పడి ఉండటం చూస్తే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. తను మానసిక వేదనకు లోనవుతున్నట్లు లేఖలో ఉంది. అదే సమయంలో మూడు నెలల నుంచి సరిగ్గా నిద్రపట్టడం లేదని లేఖలో రాసిఉంది.
విద్యార్థిని మృతి వెలుగుచూడగానే కోల్కతా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మురళీధర్ శర్మ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులను విచారణ చేశారు. విద్యార్థిని శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు స్కూలును వదిలి వాష్రూంలోకి వెళ్లినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. గంట సమయం దాటినప్పటికీ క్లాస్రూంకు రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచరు విద్యార్థిని కోసం వెతకటం ప్రారంభించారు. అనుమానం వచ్చి బాత్రూంలో వెతుకగా ఆమె రక్తమోడుతూ అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి బ్లేడు, సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
బాధితురాలు తండ్రి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. విద్యార్థిని మాత్రం తన తల్లితో కోల్కతాలో ఉంటోంది. 2017లో ఇదే స్కూలు యాజమాన్యంపై పెద్ద ఎత్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. ఆసమయంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పేరెంట్స్ అంతా నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.