ఏమైంది?: ఆత్మహత్య చేసుకోవాలని గూగుల్లో వెతికి, డీఐజీకి ఫోన్ చేసిన యువతి
తన ప్రియుడు ఒక్కసారిగా ముఖం చాటేయడంతో తీవ్ర నిరాశకు గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
బరేలీ: ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రియుడు ఒక్కసారిగా ముఖం చాటేయడంతో తీవ్ర నిరాశకు గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆత్మహత్య ఎలా చేసుకోవాలని గూగుల్లో వెతికింది. ఆ తర్వాత సూసైడ్ హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేసి డీఐజీతో మాట్లాడింది. ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి ముగింపు పలికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 24ఏళ్ల సదరు యువతి.. ఓ యువకుడితో ప్రేమలో మునిగిపోయింది. అయితే, అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో.. ఆమెను దూరంగా పెట్టాడు. దీంతో షహరాన్పూర్కు 4 కిలోమీటర్ల దూరంలోని యమునా కాలువలో దూకి మరణించాలని భావించింది. మరింత సులువుగా మరణించేందుకు గూగుల్ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో ఆమెకు సూసైడ్ హెల్ప్లైన్ నంబర్లు చాలా కనిపించాయి. ఆ తర్వాత ఓ నంబరుకు కాల్ చేస్తే.. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ జితేంద్ర కుమార్ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడే ఆమె నిర్ణయానికి ముగింపు లభించింది. ఆయన చెప్పిన మాటలు విని మరణించాలన్న తన నిర్ణయాన్ని మార్చుకుంది.
డీఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. 'జనవరి 3న నా పబ్లిక్ నంబరుకు కాల్ వచ్చింది. ఆమె చాలా అసహనంగా ఉంది. ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. అందుకోసం గూగుల్లో కూడా వెతికానని చెప్పింది. ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోవాలని, ఒక్కసారి తనను వచ్చి కలవాలని చెప్పాను. ఆపై ఆమె వచ్చింది. తన కథను చెప్పింది. ఆమె మనసును మార్చడంలో విజయం సాధించాం' అని జితేంద్ర వెల్లడించారు.
ఇటువంటి కేసులు తమకు నిత్యమూ వస్తుంటాయని, మామూలుగా అయితే, ఓ సంబంధం చెడిపోతే యువతులు వేధింపుల కేసులు పెడుతుంటారని.. ఈమె మాత్రం తన స్నేహితుడిపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని అన్నారు. అయితే, సదరు యువతి వివరాలు మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు.