అయ్యో ఎంత పనిచేశారు: కూతురును ఇంట్లో పెట్టి తాళం వేశారు..అగ్నికి ఆహుతైంది
ముంబై: తన బిడ్డ బాగా చదువుకోవాలని భావించారు. మంచి మార్కులు తెచ్చుకుని తమకు మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. కానీ ఆ తల్లిదండ్రులు ఒకటి తలిస్తే..విధి మరోలా తలచింది. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన ఆ చిన్న తప్పిదమే ఆ బాలిక ప్రాణాలు తీసింది. కన్నవారికి గర్భశోకం మిగిల్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది.. ఆ తల్లిదండ్రులు చేసిన తప్పిదం ఏమిటి..?
చదువుతుందని ఇంట్లో గదికి తాళం
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల అత్యుత్సాహం కన్న కూతురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన దాదర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... శ్రావణి చవాన్ అనే 16 ఏళ్ల బాలిక చదవడం లేదని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లోనే ఓ గదిలో పెట్టి బయటనుంచి తాళం వేశారు. ఇక్కడే ఆమెపై విధి చిన్నచూపు చూసింది. గదిలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
గదికి తాళం వేసి ఉండటంతో బయటకు రాలేకపోయిన శ్రావణి
శ్రావణి చవాన్ను ఇంట్లో తాళం వేసి ఆమె తల్లిదండ్రులు ఓ వివాహ వేడుకకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శ్రావణి చదువుకుంటూ అలానే నిద్రపోయింది. ఆసమయంలోనే అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు శ్రావణి ఉన్న గదిలోకి పాకాయి. గదికి బయట తాళం వేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. మంటలు వ్యాపించి గదిని మొత్తాన్ని పొగలు కమ్మేయడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడి మృతి చెందింది.
ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే శ్రావణి మృతి
ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బయట వేసి ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా అపస్మారక స్థితిలో పడిపోయిన శ్రావణిని చూసి వెంటనే సమీపంలోని సియాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉంటే శ్రావణి తండ్రి వకోలా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అగ్నికి విద్యుత్ సామగ్రి ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి.
మంటలను అదుపు చేసేందుకు మూడు గంటలు శ్రమించిన సిబ్బంది
దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ప్రమాదానికి కారణం ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరగడమే అని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అక్కడ ఒక కిరోసిన్ క్యాన్ కూడా పడిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
కూతురు చదువుకోవాలని చెప్పి ఆ చిన్నారిని లోపల బంధించడం చాలా బాధాకరం. తాళం వేయకుండా ఉండి ఉంటే ఆ బాలిక ప్రాణాలతో బయటపడేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన కూతురు బాగా చదవాలని తపించిన ఆ తల్లిదండ్రులకు... వారు చేసిన ఆ చిన్న తప్పిదంతో ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. బాలిక మృతదేహాన్ని చూసిన ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఆపడం ఎవరి తరమూ కాలేదు.