అబ్బాయితో స్నేహం:తల్లితో వాదించి, 10వ అంతస్తు నుండి దూకింది
బెంగళూరు: బాలుడితో స్నేహం వద్దని ఓ బాలికను పాఠశాల నుండి సస్పెండ్ చేశారు. దీనిపై తల్లితో వాగ్వాదానికి దిగింది. అది అవమానంగా భావించి ఓ 15 ఏళ్ల బాలిక పదంతస్తుల అపార్టుమెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన సోమవారం నాడు మధ్యాహ్నం కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరులోని హోసూర్ రోడ్డులోని సాలార్పూరియా గ్రీనేజ్ అపార్టుమెంట్లోని ఫ్రెండ్ విండో నుండి 15 ఏళ్ల బాలిక మోనాలి మహాలా దూకింది. మోనాలి పదో తరగతి చదువుతోంది. ఆమె తాము ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్న ఓ బాలుడితో స్నేహం చేసింది. అతను ఆమె క్లాస్మేట్ కూడా.
దీంతో పాఠశాల ఆమెను స్కూల్ నుండి సస్పెండ్ చేసింది. అనంతరం ఇంటికి వచ్చింది. దీని పైన తల్లితో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆమె మూడు గంటల సమయంలో ఈ చర్యకు పాల్పడింది. ఆమె కిటికీ నుండి దూకిన చాలాసేపటి వరకు ఎవరు అక్కడకు రాలేదు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 45 నిమిషాల అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఆ బాలిక తండ్రి కార్డియాలజిస్ట్గా పని చేస్తున్నాడు. అయితే, ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. అనంతరం శవపరీక్షల కోసం ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు.
కాగా, సదరు బాలుడితో స్నేహం పైన గతంలోను పాఠశాల యాజమాన్యం ఆ బాలికను హెచ్చరించిందని తెలుస్తోంది. అయితే, ఆ బాలిక మాత్రం స్నేహం ఆపలేదు. దీంతో సోమవారం ప్రిన్సిపల్ ఆమె తల్లిని పిలిపించి, బాలికను ఒక రోజు పైన సస్పెండ్ చేశారు.
తన తల్లితో ఈ విషయమై బాలిక ఇంటికి వచ్చాక తీవ్రంగా వాదించుకుందని, అనంతరం బెడ్ రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుందని అదే అపార్టుమెంటుకు చెందిన ఓ సాక్షి తెలిపారు. అనంతరం ఆమె ఫ్రెండ్ విండో తెరిచి, కిందకు దూకిందన్నారు. కాగా, ఆ దంపతులకు మోనాలీ ఒక్కతే కూతురు. వారు ఒడిశాకు చెందిన వారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.