ఎమోషనల్ ఫోటో: ట్రిప్కు వెళ్లి ఓల్డేజ్హోంలో నానమ్మని కలిసిన అమ్మాయి కంటతడి
Recommended Video
న్యూఢిల్లీ: పాఠశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయి తన స్కూల్ ట్రిప్ సందర్భంగా ఓ వృద్ధాశ్రమంలో తన నానమ్మను కలుసుకున్న ఓ ఉద్వేగభరిత ఫోటో వైరల్గా మారింది. తన గ్రాండ్మాను ఆ అమ్మాయి దాదాపు రెండేళ్ల తర్వాత కలిసింది.
ఈ ఎమోషనల్ పిక్చర్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఎంతోమంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తన గ్రాండ్మాను చూసి ఆ బాలిక కన్నీరుమున్నీరు అయింది. ఇది చూస్తుంటే ఎవరి కళ్లైనా చెమర్చుతాయి.
అమ్మాయి కంటతడి
ఇందుకు సంబంధించి అనితా చౌహాన్ అనే ట్విట్టరిటీ తన ట్విట్టర్లో ఫోటోను షేర్ చేశారు. దాని ప్రకారం.. ఓ స్కూల్ తన విద్యార్థులకు ఓల్ట్ ఏజ్ హోం ట్రిప్కు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ బాలిక తన గ్రాండ్మాను చూసింది. ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి వివరాలు కనుక్కోగా, ఇరువురి మాటల మధ్య ఆమె తన గ్రాండ్మా అని తెలిసి ఆ అమ్మాయి కంటతడి పెట్టింది. ఇది అందరినీ కదిలిస్తోంది.
శ్రవణుడి వంటి కథలు చెప్పాలి
ఈ ట్వీట్పై ఎందరో స్పందిస్తున్నారు. సంస్కారం అనేది ఎంతో ముఖ్యమని, మన పిల్లలకు శ్రవణుడి వంటి కథలు చెప్పాలని గౌరవ్ సీ సావంత్ పేర్కొన్నారు. శ్రవణుడి తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుపోయే కథ తెలిసిందే. ఇలాంటి కథలను మనం మన తదుపరి జనరేషన్కు చెప్పాలన్నారు. అలాగే మంచి వ్యక్తులుగా ఉండాలంటే ఏం చేయాలో మన పిల్లలకు చెప్పాలన్నారు. అలా మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలే చేయగలరన్నారు.
నెటిజన్ల ఎమోషన్
ఇది చూస్తుంటే లేదా వింటుంటే బాధేస్తోందని మరో ట్విట్టరిటి పేర్కొన్నారు. మనమంతా మన పెద్దవారిని బాగా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని మీనాదాస్ నారాయణ్ పేర్కొన్నారు. ఇది వింటుంటే హృదయం ధ్రవిస్తోంది, కన్నీళ్లు వస్తున్నాయంటూ మరొకరు నటి ఏడుస్తున్న ఫోటో పెట్టారు.
భావోద్వేగ కామెంట్స్
మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని ఒకరు పేర్కొన్నారు. అలా చేస్తే నీకు కూడా అది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేముందు మనం ఈ స్థాయికి ఎలా వచ్చామో తెలుసుకోవాలన్నారు. ఈ ఫోటోకు ఎన్నో భావోద్వేగపూరిత కామెంట్స్ వచ్చాయి.