రక్షించండి అంటూ యువతి ఫోన్..స్పాట్కు వెళ్లాక పోలీసులకు షాక్
న్యూఢిల్లీ : ఫూటుగా మద్యం తాగిన తర్వాత బుర్రలో ఎలాంటి ఆలోచనలు మెదలుతాయో ఊహించడం కష్టం. ఆకతాయి వేషాలేసి, అర్థం లేని పనులు చేసి మరుసటి రోజు మాత్రం వార్తల్లోకి ఎక్కుతుంటారు. అచ్చు ఇదే తరహాలో న్యూఢిల్లీలో ఓ ఘటన జరిగింది.
పీకలదాకా మద్యం సేవించిన ఓ యువతి.. పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన తనను రక్షించాల్సిందిగా అభ్యర్థించింది. కారులో ఇద్దరు దుండగులు తనను అపహరిస్తున్నారని, వెంటనే వచ్చి కాపాడాలని కారు నంబర్ తో సహా కారు వెళ్తున్న దారి గురించి వివరాలన్ని చెప్పేసింది. దీంతో తక్షణం అప్రమత్తమైన పోలీసులు కారును త్వరగానే చేజ్ చేశారు.
తీరా.. కారును ఆపి.. విషయంపై ఆరా తీయగా.. 'హబ్బే మేమంతా స్నేహితులమే, తనేదో తాగిన మత్తులో మీకు ఫోన్ చేసిందంతే..' అంటూ ఆమె స్నేహితులు పోలీసులకు వివరించారు. అంతా కలిసి పార్టీకి వెళ్లామని, తిరిగొచ్చే క్రమంలో.. మద్యం మత్తులో ఉండడం వల్ల ఆమె అలా చేసిందని తెలిపారు. దీంతో ఇక చేసేదేమి లేక కేసు పెట్టకుండానే పోలీసులు వారిని వదిలేశారు. అయితే.. తక్షణం స్పందించి స్పాట్ కు చేరుకున్నందుకు గాను సదరు పోలీసులకు కమిషనర్ రివార్డులు ప్రకటించడం విశేషం.