డబ్బు కోసం స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం.. తండ్రినే బెదిరించిన కూతురు
‘మీఅమ్మాయిని కిడ్నాప్ చేశాం.. కూతురు ప్రాణాలతో కావాలనుకుంటే వెంటనే రూ.10 లక్షలు పంపించండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా..’
నోయిడా: ఓ యువతి డబ్బు కోసం తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడింది. తన తండ్రికి ఫోన్ చేయించి బెదిరించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో నాటకమంతా బయటపడింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... కాన్పూర్లోని ఐటీ ఇనిస్టిట్యూట్లో ఇంజినీరింగ్ చదువుతున్న ముస్కన్ అగర్వాల్(20) తన ముగ్గురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తండ్రితో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆమె గదిలోకి వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయినట్లు డ్రామా సృష్టించింది.
ఆ తరువాత తాను కిడ్నాప్కు గురైనట్లు తన తండ్రికి ఫోన్ చేయించి 'మీఅమ్మాయిని కిడ్నాప్ చేశాం.. కూతురు ప్రాణాలతో కావాలనుకుంటే వెంటనే రూ.10 లక్షలు పంపించండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా..' అంటూ స్నేహితులతో చెప్పించింది.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ముస్కన్ తండ్రి శివఅగర్వాల్ విషయాన్ని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తెలియజేయడంతో నిజం బయటపడింది. ముస్కన్ ఫోన్ కట్ అయిన కాసేపటికి ముస్కన్ మొబైల్ నుంచి తండ్రి అగర్వాల్ ఫోన్కు రెండు సందేశాలు వచ్చాయి.
'అరగంటలో కూతురు ముస్కన్ బ్యాంకు ఖాతాకి అర్జెంటుగా రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆమెను విడిచిపెట్టబోమనేది ఆ మెసేజ్ సారాంశం'. దీంతో కంగారు పడిపోయిన అగర్వాల్ వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు యూపీ ఎస్టీఎఫ్ డీఎస్పీ ఆర్కే మిశ్రా తెలిపారు.
ఖాతాలో డబ్బు పడిన వెంటనే అనంత్, రితురాజ్సింగ్ అనే వ్యక్తులు ఏటీఎం ద్వారా ముస్కన్ ఖాతా నుంచి రూ.30 వేలు డ్రా చేయడాన్ని పోలీసులు పసిగట్టారు. అంతేకాదు, ముస్కన్ తన బాయ్ఫ్రెండ్ అదిత్య శ్రీవాస్తవతో కలిసి పారి చౌక్లోని పార్కులో ఉన్నట్లు కూడా కనిపెట్టారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని విచారించారు. ముస్కన్ తనతో పాటు చదువుకుంటున్న మరో స్నేహితురాలికి రూ.4 లక్షలు డబ్బులు ఇవ్వగా, వాటిని తండ్రి తిరిగి తీసుకురమ్మని ఒత్తిడి చేయడంతో స్నేహితురాలిని కాపాడేందుకు ఈ పని చేసినట్లు విచారణలో వెల్లడించింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి డ్రా చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు.