ప్రేమించలేదని విద్యార్థిని మీద యాసిడ్ దాడి
కోల్ కత్తా: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడిన కిరాతకుడు చివరికి కాలేజ్ విద్యార్థిని ముఖం మీద యాసిడ్ తో దాడి చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యువుతో పోరాడుతున్నది.
సీనియర్ పోలీసు అధికారి ఎ. రవీంద్రనాథన్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దర్ లో 20 సంవత్సరాల యువతి డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నది. అదే ప్రాంతానికి చెందిన అభి షా (25) అనే నిరుద్యోగి ఆ యువతి మీద కన్ను వేశాడు.
నిత్యం ఆమె వెంటపడి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అయితే అతని ప్రవర్తన గురించి ముందే తెలుసుకున్న ఆ యువతి అందుకు అంగీకరించలేదు. అయినా అభిషా ఆమె వెంటపడి వేధించాడు.
మంగళవారం కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న ఆ యువతిని అడ్డగించిన అభిషా వాగ్వివాదానికి దిగాడు. తరువాత సహనం కోల్పోయి వెంట తీసుకు వెళ్లిన యాసిడ్ తీసుకుని యువతి ముఖం మీద పోసేశాడు. స్థానికులు విషయం గుర్తించి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అభిషా తప్పించుకున్నాడు.
స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, నిరుద్యోగి అయిన అభిషా నిత్యం ఆమెను వేధించేవాడని విచారణలో వెలుగు చూసిందని బుధవారం సీనియర్ పోలీసు అధికారి రవీంద్రనాథన్ చెప్పారు.