ఫేస్బుక్లో అన్ఫ్రెండ్ చేసిందని మరిగే నీళ్లతో దాడి
పాట్నా: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తనను అన్ ఫ్రెండ్ చేసిందనే నెపంతో ఓ యువకుడు తన స్నేహితురాలిపై మరుగుతున్న నీటి పోశాడు. దీంతో ఆమెకు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ఫూర్ జిల్లాలోని కోజిమహ్మద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నిపూర్లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందితుడు యుధిస్థిర్ యాదవ్ పదవ తరగతి చదువుతున్నాడు. బాధితురాలు ఎనిమిదవ తరగతి చదువుతోంది. కాగా యుధిస్థిర్ బాధితురాలి తండ్రి దగ్గర ట్యూషన్కు వచ్చే వాడు. ఈ క్రమంలోనే బాధితురాలితో యుధిస్థిర్ యాదవ్కు బాలికకు స్నేహం ఏర్పడింది. దీంతో వీరు తమ ఫేస్బుక్ ఖాతాలో తరచూ చాట్ చేస్తుండేవారు.
అయితే కొన్ని రోజుల తర్వాత అతని వైఖరి నచ్చకపోవడంతో ఆమె తన ఫేస్బుక్ ఖాతా నుంచి అతన్ని అన్ఫ్రెండ్ చేసింది. అయితే ఇంత చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి గురైన యుధిస్థిర్ బుధవారం సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి మరుగుతున్న నీటిని ఆమెపై పోశాడు. దీంతో ఆమె ముఖం ఒకవైపు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర గాయాలపాలైన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కోజిమహ్మద్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కెకె ఖురేషి తెలిపారు. మిథాన్పుర ప్రాంతంలోని నిందితుని తాత్కాలిక నివాసం, వైశాలి జిల్లాలోని పాతేపూర్ గ్రామంలోని తన సొంత ఇంట్లో కూడా గాలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుని ఆచూకీ తెలియలేదని చెప్పారు.