విద్యార్థినుల బట్టలు విప్పించి అశ్లీల నృత్యాలు చేయించిన ఖాకీలు..మహారాష్ట్రలో దారుణం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళలు యువతులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఓ హాస్టల్లో విద్యార్థినులను వేధింపులకు గురి చేయడం, వారితో బట్టలు విప్పించి అశ్లీల నృత్యాలు చేయించడం చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ స్థానిక లేడీస్ హాస్టల్ అధికారులు, స్థానిక పురుషులు మరియు స్థానిక పోలీసు అధికారులు విద్యార్థులను బట్టలు విప్పించి డాన్స్ చేయించారు.
ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులచే అశ్లీల నృత్యాలు
ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులచే అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ మొత్తం చర్యను మొబైల్ ఫోన్లో చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటన మార్చి ఒకటవ తేదీన జరిగింది. స్థానిక ఎన్జీఓ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.చిఖాలి నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే శ్వేతా మహాల మహారాష్ట్ర అసెంబ్లీ దిగువ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయాన్ని లేవనెత్తారు.
మహారాష్ట్ర చట్ట సభలో హాస్టల్ లో అశ్లీల నృత్యాలు చేయించిన పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
విద్యార్థినులను నగ్నంగా ప్రభుత్వ లేడీస్ హాస్టల్ లో నృత్యాలు చేయడం దారుణమని, మహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారులు కూడా ఈ సిగ్గుపడే చర్యలో భాగమే అని ఎమ్మెల్యే శ్వేతా మహాలే అన్నారు. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుందని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . ఈ విషయంలో కఠిన చర్య తీసుకోవాలని తాము కోరుతున్నట్లుగా శ్వేత మహాలే స్పష్టం చేశారు .
జల్గావ్ లో లేడీస్ హాస్టల్ లో ఖాకీల అకృత్యాలు .. విద్యార్థినులతో అశ్లీల నృత్యాలు
జల్గావ్ నగరంలోని గణేష్ కాలనీ ప్రాంతంలో 'ఆశాదీప్' అనే రాష్ట్ర ప్రభుత్వ లేడీస్ హాస్టల్ ఉంది. మార్చి 01 న, హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న కొన్ని అక్రమ కార్యకలాపాల గురించి విచారణ పేరిట స్థానిక ప్రాంతానికి చెందిన కొంతమంది పోలీసు అధికారులు మరియు పురుషులు హాస్టల్లోకి ప్రవేశించారు. ఆపై వారు అక్కడ ఉన్న విద్యార్థినులను బెదిరించి వారి బట్టలు విప్పించి డాన్స్ చేయించారు. వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు .
నలుగురు సభ్యలతో కమిటీ వేశామన్న మహా హోం మంత్రి .. రెండు రోజుల్లో నివేదిక
బాధితుల్లో ఒకరు ఈ సంఘటన గురించి స్థానిక ఎన్జీఓకు సమాచారం ఇచ్చి మొత్తం సంఘటనను వివరించారు. తరువాత ఎన్జీఓ కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.ఇక ఇదే విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే శ్వేతా మహాలే చట్టసభ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ దర్యాప్తుకు ఆదేశించామని, నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని తెలిపారు.