దారుణం: 30 మంది చిన్నారులకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారు
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. ముజాఫర్పూర్లో ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న వసతి గృహంలో దాదాపు 30 మంది అమ్మాయిలపై కామాంధులు అత్యాచారం చేశారు. దీంతో అమ్మాయిల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మానసిక పరిస్థితి కూడా సరిగ్గాలేదని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వం తరుపున ఓ ఎన్జీఓ నడుపుతున్న సేవా సంకల్ప్ ఏవం వికాస్ సమితి బాలికా వసతి గృహంలో మొత్తం 42 మంది ఉన్నారు. అయితే ఈ వసతి గృహంలో ప్రతిరోజూ అమ్మాయిలపై అత్యాచారం జరుగుతోందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక రిపోర్టు ఇవ్వడంతో ఈ దారుణం వెలుగు చూసింది. నలందా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కోయిల్వార్ మెంటల్ హాస్పిటల్కు చెందిన వైద్యులు అమ్మాయిలకు చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారుల పరిస్థితి మాత్రం మెరుగుపడటం లేదని వారు తెలిపారు. మొత్తం 24 మంది చిన్నారులపై అత్యాచారం జరిగిందని వైద్యులు తెలిపారు. అందులో అందరూ మైనర్లే కాగా.. ఒక ఏడేళ్ల బాలిక కూడా ఉందన్నారు.
అత్యాచారానికి పాల్పడే ముందు చిన్నారుల శరీరంపై నిప్పులతో కాల్చేవారని, గాట్లు పెట్టేవారని ఆ తర్వాత డ్రగ్స్ ఇచ్చి చిన్నారులపై అత్యాచారం చేసేవారని టిస్ సంస్థ రిపోర్ట్లో పేర్కొంది. చిన్నారులను కాపాడాల్సిన వారే ఇలా పశువుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ధ్వజమెత్తారు.అంతేకాదు ఒక అమ్మాయి సహకరించనందుకు ఆమెను చితకబాది చంపి అక్కడే పూడ్చేశారని కూడా టిస్ తెలిపింది.
ఈ ఘటన వెలుగులోకి రాగానే అమ్మాయిలందరినీ పాట్నా, మధుబని ప్రాంతాలకు అధికారులు తరలించారు. కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాత తమపై జరిగిన కీచకపర్వాన్ని చిన్నారులు వెల్లడించారు. చికిత్స అందిస్తున్న సమయంలో చిన్నారులు వింతగా ప్రవర్తిస్తున్నారని సీనియర్ సైకియాట్రిస్ట్ రాజ్కుమార్ తెలిపారు. ఎవరైనా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడక ముందు వారికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసేవారని డాక్టర్ తెలిపారు. చిన్నారుల శరీరంపై ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తులు అలానే ఉన్నాయన్నారు.
చిన్నారులు నరకం అనుభవించారని అందుకే వారి హృదయాలు విరిగిపోయాయని ఐక్యరాజ్యసమితికి చెందిన సునీల్ ఝా అన్నారు. బతకాలన్న ఆశ వారిలో చచ్చిపోయిందన్నారు. బలవంతంగా డ్రగ్స్కు అలవాటు పడేలా ఆ దుండగులు చేశారని సునీల్ మండిపడ్డారు. ప్రస్తుతం అమ్మాయిలు త్వరగా కోలుకోవడమే తమ ముందున్న కర్తవ్యం అని వైద్యులు తెలిపారు. కేసు కోర్టు ముందుకు రాకముందే అమ్మాయిలను సాధారణ స్థితికి తీసుకురాగలిగితే నిందితులకు కఠిన శిక్ష పడుతుందని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో స్థానికంగా బలమైన వ్యక్తిగా ఉన్న బ్రజేష్ ఠాకూర్తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.