షాకింగ్: ‘కూతురు కిడ్నాప్’ ఫిర్యాదు చేస్తే.. డీజిల్ పోయించుకున్న పోలీసులు, ఆ తల్లి వేదన
లక్నో: కొందరు పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మొత్తం ఆ శాఖకే చెడ్డ పేరు తెస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన కూతురు కిడ్నాప్ అయ్యిందని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తమ వాహనాల్లో డీజిల్ పోస్తే వెతుకుతామంటూ జవాబివ్వడంతో ఆ తల్లి తీవ్ర వేదనకు గురయ్యారు.
కూతురు కిడ్నాప్ ఫిర్యాదు చేస్తే..
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ జిల్లాకు చెందిన ఓ దివ్యాంగురాలైన మహిళ తన కుమార్తె కిడ్నాప్కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ బాలికను వెతికిపట్టుకోవడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమె కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. ఆ తర్వాత ఆమె సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
కుమార్తెపై నిందలు.. 15వేల డీజిల్ పోయించుకుని..
'మీ కుమార్తె కోసమే వెతుకుతున్నాం అని ఒకసారి చెప్తారు. మరోసారి ఏం చెప్పకుండానే బయటికి నెట్టేస్తారు. అంతేగాక, నా కుమార్తెపై నిందలు వేస్తున్నారు. వారి వాహనాల్లో డీజిల్ నింపితేనే.. నా కూతురును వెతుకుతామంటున్నారు. నేను పోలీసులకు లంచం ఇవ్వలేదు. కానీ, డీజిల్ మాత్రం నింపించాను. అందుకోసం రూ. 10వేల నుంచి15వేల వరకు అప్పు చేశాను. ఇలా ఎంతకాలం చేయాలి' అని ఆ తల్లి మీడియా ముందు వాపోయారు.
కిడ్నాప్ చేసింది బంధువేనంటూ..
తాను ఫిర్యాదు చేసిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరు మాత్రమే కాస్త సహకరిస్తున్నారని ఆ మహిళ తెలిపారు. కాగా, తన బంధువే తన కూతురును కిడ్నాప్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఆమె మీడియాతో పంచుకున్న తన ఆవేదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో యూపీ పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ పోలీసులపై చర్యలంటూ ఉన్నతాధికారులు
ఈ నేపథ్యంలో కాన్పూర్ సీనియర్ పోలీసు అధికారి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ స్పందించారు. ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఆమె ఆరోపణలు వాస్తవమని తేలితే.. బాధ్యులైనవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కిడ్నాపైన యువతి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నాయని తెలిపారు.
Recommended Video