పూలబోకెలు వద్దు, పుస్తకాలు ఇవ్వండి, ప్రమాణ స్వీకారానికొచ్చే ప్రజలకు హేమంత్ సోరెన్
మరో రెండురోజుల్లో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ పదవీ ప్రమాణం చేయబోతున్నారు. తన పదవీ ప్రమాణానికి వచ్చే ప్రజలకు హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు. పూలబోకెలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. హేమంత్ సోరెన్ ప్రతిపాదన చర్చకు దారితీసింది.
పుస్తకాలతో విజ్ఞానం
తనకు పుస్తకాలు ఇవ్వడంతో విజ్ఞానం సంపాదించొచ్చని హేమంత్ సోరెన్ తెలిపారు. అదే పూలు ఇస్తే కాసేపు పట్టుకొని ఉంటామని, తర్వాత అవి వాడిపోతాయని చెప్పారు. అంతేకాదు తనకు పూలబోకేలు ఇస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
పూలబోకెలు వద్దు
పూలబోకెలకు బదులు పుస్తకాలు ఇస్తే లైబ్రరీలో పెట్టుకోవచ్చిని హేమంత్ సోరెన్ చెప్పారు. ఆ పుస్తకాలతో విజ్ఞాన భాండాగారంగా పనిచేస్తుందని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
పాల్గొనేది వీరు..
హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీ చిదంబరం, అహ్మాద్ పటేల్ హాజరయ్యే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ హాజరుకానున్నారు. జాబితాలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీఎస్పీ చీఫ్ మాయావతి, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్లు కూడా ఉన్నాయి.
పాల్గొనేది వీరు..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి జయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. 47 స్థానాల్లో జేఎంఎం-కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. అధికార బీజేపీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. సీఎం రఘుబర్ దాస్ కూడా ఓడిపోవడం చర్చకు దారితీసింది.