వారి పేర్లు ఇవ్వండి.. మంత్రుల తీరుపై మోడీ గుస్సా..
ఢిల్లీ : పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని కేంద్ర మంత్రులపై ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. సెషన్కు హాజరుకాని మంత్రుల పేర్లు సాయంత్రానికల్లా తనకు ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ సెషన్కు డుమ్మా కొడుతున్న కేంద్ర మంత్రుల గురించి ఆరా తీశారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రుల స్థానంలో సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు తమ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పడు కూడా సభలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
సభలో బీజేపీ నేతల హాజరు, ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్నట్లు మోడీ జులై 2న జరిగిన సమావేశంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ సభ్యులంతా సభకు హాజరుకావాల్సిందేనని మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్గా ఉండాలని సూచించారు.