కశ్మీర్ స్థానికులతో దోవల్ భోజనం..వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజాద్
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అయ్యేందుకు తెరవెనక కృషి చేసిన వ్యక్తుల్లో ఒకరు జాతీయ భద్రతాసలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఒకరు. ముందునుంచి జమ్మూ కశ్మీర్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం నివేదిక సమర్పించిన తర్వాతే కేంద్రం జమ్మూ కశ్మీర్ విషయంలో అడుగులు వేగవంతంగా ముందుకేసింది. జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇక జమ్మూ కశ్మీర్లో పరిస్థితులను అక్కడే ఉండి అజిత్ దోవల్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం షోపియన్లో పర్యటించారు. అక్కడి స్థానికులతో ముచ్చటిస్తూ వారితో కలిసి భోజనం చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది.
వీడియో పై ఆజాద్ స్పందన ఇదీ..!
ఇక స్థానికులతో కలిసి అజిత్ దోవల్ భోజనం చేయడంపై రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ స్పందించారు. డబ్బులు ఇచ్చి ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అన్ని అన్నారు. అంటే బీజేపీ లేదా అజిత్ దోవల్ అక్కడి స్థానికులకు డబ్బులు ఇచ్చి అతని వెంట తీసుకెళ్లి ఉంటారని ఉద్దేశంతో గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బుధవారం రోజున అజిత్ దోవల్ షోపియన్ స్థానికులతో ముచ్చటించారు. ఇకపై మీ పిల్లలు వారి పిల్లలు స్థానికంగా ఇక్కడే ఉండి ఓ గొప్ప స్థానంలో నిలుస్తారని దోవల్ స్థానికులకు భరోసా ఇచ్చారు.
జమ్మూకశ్మీర్ విభజన తర్వాత రాష్ట్రంలోనే దోవల్ మకాం
మంగళవారం నుంచి కశ్మీర్లో అజిత్ దోవల్ పర్యటిస్తున్నారు. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరుసటి రోజునుంచే అజిత్ దోవల్ తనకు అప్పగించిన మిషన్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇకపై అంతా బాగానే ఉంటుందని స్థానికులకు ధైర్యం చెబుతూ వారి రక్షణ భద్రత బాధ్యతలను తామే తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక అక్కడి పోలీసులను భద్రతా దళాలను కలిసిన అజిత్ దోవల్ వారి పనితీరును ప్రశంసించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపు చేయడాన్ని కొనియాడారు.
ఇంకా ఆంక్షల చట్రంలోనే జమ్మూ కశ్మీర్
ఆర్టికల్ 370 రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అజిత్ దోవల్ వీడియోపై కూడా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం స్థానికులకు డబ్బులు ఇచ్చి వీడియో తీసి ఉంటారని మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను కూడా రద్దు చేసింది