ఒకపూట భోజనం చేయొద్దు.. త్యాగం చేయండి: అన్నార్తులను ఆదుకోండి: మోడీ, జేపీ నడ్డా పిలుపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించారు. 21 రోజుల పాటు కొనసాగబోతున్న ఈ లాక్డౌన్ పర్వం మూడోవారంలోకి అడుగు పెట్టబోతోంది. ప్రధాని చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటలతో లాక్డౌన్ ముగుస్తుంది. ఆ తరువాత దీన్ని కొనసాగిస్తారా? లేక.. కొన్ని రోజుల పాటు సడళింపు ఇస్తారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కూడా రాలేదు.
అన్నార్తులను ఆదుకోవాలంటూ..
లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది దినసరి వేతన కార్మికులు, రోజువారీ కూలీలకు పొట్ట గడవటం కనాకష్టంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు, వలస కార్మికులు ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటోన్నారో తెలియని విషయం కాదు. దేశవ్యాప్తంగా రోడ్డున పడిన లక్షలాది మంది కార్మికులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. వారికి ఆహారాన్ని అందజేస్తున్నాయి.
ఒకపూట భోజనాన్ని మానేయాలంటూ
ఇలాంటి గడ్డు పరిస్థితులు చుట్టుముట్టిన నేపథ్యంలో.. నిరుపేదలను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఒక పూట భోజనాన్ని మానేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఒకపూట భోజనాన్ని మానివేసి, దాన్ని పేదలకు అందించాలని వారు సూచించారు. ప్రతి కార్యకర్త తమ పిలుపునకు స్పందించాలని ఆదేశించారు.
13న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం..
ఈ నెల 13వ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ, జేపీ నడ్డా ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కూడా తాము త్యాగం చేసిన ఒకపూట భోజనాన్ని తమ బూత్ పరిధిలోని నిరు పేదలను అందించాలని సూచించారు. బూత్ను ఒక యూనిట్గా తీసుకుని పేదలను గుర్తించాలని, తాము నివసించే ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలను చేపట్టాలని అన్నారు.