స్పీకర్కే షాక్ ఇచ్చిన రెబెల్స్: ఇప్పట్లో ముంబై వదిలి రాలేమంటూ కౌంటర్ ఎటాక్
బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు. ఏదో ఒక సాకుతో బలపరీక్ష నుంచి తప్పించుకుంటోంది ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బలపరీక్షకు సిద్ధపడాలని అంటూ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ఇచ్చిన అల్టిమేటం కూడా పెద్దగా ప్రభావం చూపబోదనే అంటున్నారు. దీనికి ప్రధాన కారణం- కాంగ్రెస్పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబై వదిలి రావడానికి ఇష్టపడకపోవడమేనని అంటున్నారు.
నిజానికి- మంగళవారం ఉదయం 11 గంటలకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ను కలుసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సమన్లను కూడా జారీ చేశారు. ప్రస్తుతం వారంతా ముంబైలో మకాం వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ సమన్లను ధిక్కరించారు. తాము ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేది లేదంటూ భీష్మించారు. కనీసం నాలుగు వారాల గడువు కావాలని కోరారు. నాలుగు వారాల తరువాతే తాము సమన్లకు సమాధానం ఇస్తామని చెబుతున్నారే తప్ప.. స్పీకర్ను కలుస్తామని స్పష్టం చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమన్లను అందుకున్న వెంటనే తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ కౌంటర్ ఎటాక్ ఇస్తూ లేఖ రాశారు. తమకు నాలుగు వారాల గడువు కోవాలని కోరారు.
ఈ లేఖపై కాంగ్రెస్ సభ్యులు రమేష్ జార్కిహోళి, మహేష్ కుమటహళ్లి, బైరాతి బసవరాజ్, బీసీ పాటిల్, ప్రతాప్గౌడ పాటిల్, శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, ఎంటీబీ నాగరాజ్, మునిరత్నజనతాదళ్ (ఎస్)కు చెందిన కె గోపాలయ్య, విశ్వనాథ్, నారాయణ గౌడ సంతకాలు చేశారు. వారితో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ కూడా వేరుగా స్పీకర్కు లేఖను రాశారు. సమన్లను ధిక్కరించిన నేపథ్యంలో- వారందరిపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. దీన్ని ఆయన వినియోగించకుంటారా? లేక వారి విచక్షణకే వదిలి వేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీల పడినందున తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యనూ తీసుకోవడానికి సాహసించకపోవచ్చని అంటున్నారు.