కట్నం ఇచ్చినందుకు అమ్మాయి తండ్రిపై కేసు పెట్టండి.. జోధ్పూర్ కోర్టు సంచలన నిర్ణయం..
జోధ్పూర్ : కట్నం ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా నేరమే. చట్టం ఇదే విషయాన్ని చెబుతోంది. అయితే చాలా కేసుల్లో కోర్టులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాయి. అందుకే కట్నం ఇచ్చినందుకు అమ్మాయి తరఫు వారిపై ఎలాంటి కేసులు నమోదుకావు . అయితే తాజాగా జోధ్పూర్ కోర్టు ఈ విషయంలో సంచలన తీర్పు చెప్పింది. అల్లుడికి కట్నం ఇచ్చిన వధువు తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.
కుమార్తెను వేధిస్తున్నారని ఫిర్యాదు
గతంలో సైన్యంలో పనిచేసి రిటైరైన రాం లాల్ తన కుమార్తె మనీషాను కైలాష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్కు ఇచ్చి 2017లో పెళ్లి చేశాడు. వివాహం అనంతరం ఆ దంపతులు నోయిడాలో కాపురం పెట్టారు. కొన్నాళ్ల పాటు సంసారం సజావుగానే సాగినా ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. దీంతో కట్నం కోసం అత్త తన కుమార్తెను వేధిస్తోందని, ఆమెను భర్తతో కలిసి ఉండనివ్వడంలేదని మనీషా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైట్లో అల్లుడితో పాటు అతని తండ్రి పేరు చేర్చాడు. వివాహం సమయంలో లక్ష రూపాయల నగదును కట్నంగా ఇచ్చానని కంప్లైట్లో రాశాడు.
కట్నం తీసుకోవడమూ నేరమే
రాం లాల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం జోధ్పూర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా తాము కట్నం తీసుకున్నామనే ఆరోపణలను కైలాష్ కుటుంబసభ్యులు ఖండించారు. వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పరీక్ కట్నం తీసుకోవడం నేరమైతే ఇవ్వడం కూడా నేరమే అవుతుందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కట్నం ఇచ్చామని రాం లాల్ అంగీకరించినందున అతనిపై కేసు పెట్టేలా పోలీసులను ఆదేశించాలని విన్నవించారు.
కేసు పెట్టాలని జడ్జి ఆదేశం
కైలాష్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ రిచా చౌదరీ వధువు తండ్రి రాం లాల్పై వరకట్న నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించారు. డీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కింద కట్నం ఇచ్చిన వారిపై కేసు నమోదుచేయడం ఇదే తొలిసారని డిఫెన్స్ న్యాయవాది పరీక్ చెప్పారు. కోర్టులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కట్నం కోసం వేధిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెట్టేవారి సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.