వీడియో: దేవభూమిలో ఉత్పాతం: ధౌలిగంగ మహోగ్రరూపం: తెగిన ఆనకట్ట: ఊరికి ఊరు గల్లంతు
డెహ్రాడున్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్ కోర్ జోన్లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. ఈ ఘటనలో వందలాది మంది కొట్టుకుని పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
300 మందికి పైగా గల్లంతు..
ప్రాథమికంగా 300 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వారిలో పలువురు కార్మికులు ఉన్నారు. వారంతా తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపట్టాయి. ఇండో-టిబెట్ బెటాలియన్ పోలీసులు సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలో దింపారు.
హరిద్వార్ వరకూ హైఅలర్ట్..
ఈ ఘటన పట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సహాయక, పునరావాస చర్యలను చేపట్టింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాస్సేపట్లో తపోవన్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అలకనంద, ధౌలిగంగా నదీ పరీవాహక ప్రాంతం మొత్తాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. హరిద్వార్ వరకూ హైఅలర్ట్ను ప్రకటించారు. ఎవ్వరూ నదిని దాటే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరికలను జారీ చేశారు. నదీ తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశించారు.
తెగిన హైడల్ ప్రాజెక్ట్..
ధౌలిగంగ నది మీద 24 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఓ జల విద్యుత్ ప్రాజెక్ట్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ దిగువన రైనీ గ్రామం ఉంది. నందా దేవి జాతీయ పార్కు పరిధిలో గ్లేసియర్ విరిగిపడటంతో ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. దాని ప్రభావం అలకనంద నదీపైనా పడింది. అమాంతంగా పెరిగిన ప్రవాహ ఉధృతికి జల విద్యుత్ ప్రాజెక్ట్ తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా తెగిపోయింది. నదీ జలాలు పోటెత్తాయి. రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి.
సంఘటనా స్థలానికి త్రివేంద్ర సింగ్
ఈ ఘటనలో 300 మందికి పైగా కొట్టుకుని పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. వారిలో చాలామంది ఈ హైడల్ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నవారేనని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి త్రివేద్ర సింగ్ రావత్ తపోవన్ ప్రాంతానికి బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలను చేపట్టారు. ఐటీబీపీ రంగంలోకి దిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ గాలింపు చర్యలను చేపట్టారు. హెలికాపర్టను వినియోగిస్తోన్నారు.