అదే జరిగితే ప్రపంచానికి ముప్పే: వాన్నాక్రై తర్వాతి ఎటాక్పై హడలెత్తిస్తోన్న అలర్ట్!
వాన్నక్రై తర్వాతి ఎటాక్ స్మార్ట్ ఫోన్లపై ఉండవచ్చునన్న అనుమానాలతో.. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల సిస్టమ్స్ను హ్యాక్ చేసి.. ఆయా సంస్థల నెట్ వర్క్ ను స్తంభించేలా చేసిన రాన్సమ్ వేర్ ముప్పు మరోసారి పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని, ఏ క్షణంలో అయినా మళ్లీ సైబర్ దాడి జరగవచ్చునని, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లను హ్యాక్ చేసిన రాన్సమ్ వేర్.. తన తర్వాతి టార్గెట్ గా స్మార్ట్ ఫోన్లపై దాడి చేయవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాన్సమ్ వేర్ విసిరిన పంజాకు రెండు లక్షలకు పైగా సిస్టమ్స్ స్తంభించిపోయాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే.. చాలావరకు డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ పనిచేయలేదు.
వాన్నక్రై తర్వాతి ఎటాక్ స్మార్ట్ ఫోన్లపై ఉండవచ్చునన్న అనుమానాలతో.. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువమంది ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ సిస్టమ్ కావడంతో.. దీనిపై గనుక హ్యాకర్లు దాడి చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు కష్టాలు మొదలైనట్లే.
తర్వాతి ఎటాక్ కు సంబంధించి.. రైల్వేలు, బ్యాంకులు, పవర్ యుటిలిటీస్, ఇతర ప్రొవైడర్లకు ఇప్పటికే సమాచారం అందించామని సంజయ్ తెలిపారు. దీనికి సంబంధించిన అలర్ట్ లను పంపిస్తున్నామని అన్నారు. వాన్నక్రై ఎటాక్ పై అధ్యయనం చేయడానికి ఓ స్పెషల్ టీమ్ ను కూడా నియమించినట్లు తెలిపారు.
హ్యాకర్లు గనుక స్మార్ట్ ఫోన్లపై పంజా విసిరితే.. ప్రపంచం విలవిలలాడిపోవడం ఖాయం. వ్యక్తిగత సమాచారం నుంచి, ఆర్థిక లావాదేవీల వరకు చాలామంది స్మార్ట్ ఫోన్లలో సమాచారం నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి.. ఆ డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంటుంది.