సెలబ్రిటీలా విమానంలో చిందులేసింది: దించేశారు
ముంబై: తాను సెలబ్రిటీ అంటూ ఫోజు కొట్టిన మహిళను విమానంలో నుంచి కిందకు దించేశారు. అంతే కాకుండా ఆమె మీద అధికారులకు ఫిర్యాదు చేశారు. ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
ముంబై ఎయిర్ పోర్టులో ముంబై నుంచి లక్నో వెలుతున్న జీ8 - 387 గో ఎయిర్ విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న ఓ మహిళ ఏరో బ్రిడ్జ్ మీద ఎక్కుతున్న సమయంలో తన బ్యాగ్ తీసుకుని సాటి ప్రయాణికుల మీద దాడి చేసింది.
అంతే కాకుండా ముందు నిలుచున్న ప్రయాణికులను పక్కకు నెట్టి విమానంలోకి దూసుకు వెళ్లింది. ఆమె గురించి సాటి ప్రయాణికులు గో ఎయిర్ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తరువాత విమాన సిబ్బంది ఆమె దగ్గరకు వెళ్లారు.
అంతే ఆమెకు కోపం వచ్చేసింది. నా దగ్గరకే వచ్చి వివరణ అడుగుతారా ? ఏమనుకుంటున్నారు ? నేను ఎవరునుకుంటున్నారు ? అని చిందులు వేసింది. విమాన సిబ్బంది ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.
అయితే ఆమె ఫోజు కొట్టి వారిని నోటికొచ్చినట్లు తిట్టింది. విమాన ప్రయాణం నియమాలు ఉల్లంఘించినందుకు ఆమెను విమానంలో నుంచి కిందకు దించేశారు. ఆమె మీద సీఐఎస్ఎఫ్ కు ఫిర్యాదు చేశారు.