‘గో కరోనా గో’ కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్దాస్ అథవాలే మంగళవారం కరోనా బారినపడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అథవాలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
పాయల్ ఘోష్ చేరిక కార్యక్రమంలో అథవాలే..
ఇది ఇలావుంటే, రామ్దాస్ అథవాలే సోమవారం తన పార్టీలోకి సినీ నటి పాయల్ ఘోష్ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెను ఆర్పీఐ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆయన నియమించారు. తన పార్టీలో చేరినందుకు పాయల్ ఘోష్కు ధన్యవాదాలు తెలిపారు. ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్పై పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అథవాలేకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ ఆందోళన చెందుతున్నారు.
గో కరోనా గో అంటూ రామ్దాస్ అథవాలే సంచలనం
కాగా, దేశంలో కరోనావైరస్ మొదలైన సమయం(ఫిబ్రవరి)లో మంత్రి రాందాస్ అథవాలే తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కరోనాను అరికట్టేందుకు మంత్రం జపించాలని ఆయన సూచించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ‘గో కరోనా.. కరోనా గో' అని ఆయన అనడం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఓ సమావేశంలోనూ ఆయన గో కరోనా గో అంటూ ప్రార్థనలు చేశారు. ఈ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై పలువురు విమర్శలు కూడా చేశారు.
అథవాలేకు డయాబెటీస్ కూడా..
60 ఏళ్ల అథవాలే రాజ్యసభ సభ్యుడు, నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రిత్వవర్గంలో సామాజిక న్యాయశాఖ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అథవాలేకు డయాబెటీస్ కూడా ఉందని ఆయన సహాయకులు తెలిపారు. కాగా, అక్టోబర్ 26 న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 16లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, లక్షా 34వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి.