విభజన ప్రజాస్వామ్యం వద్దంటే ఉత్తర కొరియాకు వెళ్లండి: గవర్నర్ వివాదాస్పద ట్వీట్
విభజన ప్రజాస్వామ్యం వద్దనుకునేవారు ఉత్తరకొరియాకు వెళ్లండి. అవును ఈ మాటలు అన్నది ఎవరోకాదు సాక్షాత్తు మేఘాలయా గవర్నర్ తథగత రాయ్. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు పెద్ద ఎత్తున్న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేఘాలయా గవర్నర్ తథగత రాయ్ వివాదాస్పద ట్వీట్ చేస్తూ కొత్తగా వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యంలో కచ్చితంగా విభజన ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ అది ఇష్టం లేని వారు ఉత్తరకొరియాకు వెళ్లొచ్చు అంటూ ట్వీట్ చేయడం వివాదాన్ని రేకెత్తించింది.
దేశంలో వివాదాస్పదమైన వాతావరణం నెలకొన్న దృష్ట్యా రెండు విషయాలను మరవకూడదని గవర్నర్ తథగత రాయ్ అన్నారు. మతప్రాతిపదికన ఒకప్పుడు దేశం విభజించబడిందనేది ఒకటైతే ప్రజాస్వామ్యంలో విభన అనేది అవసరంగా చూడాలని రెండో విషయంగా చెప్పారు. రాజ్భవన్ను ఆందోళనకారులు ముట్టడించడానికి కొన్ని గంటల ముందు ఈ గవర్నర్ ఈ ట్వీట్ చేశారు. రాజ్భవన్ను ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అంతేకాదు భాష్పవాయువును కూడా ప్రయోగించడంతో చాలామంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు గాయపడ్డారు.
బయట వ్యక్తులు తమ ప్రాంతంలోకి ప్రవేశించరాదని చెబుతూ ఉన్న ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. అంతేకాదు ఒకవేళ ప్రవేశించాలంటే రిజిస్టర్ అయి ఉండాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కేంద్రం ఇన్నర్ లైన్ పర్మిట్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో మరో ఈశాన్య రాష్ట్రం అస్సాం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇప్పటికే అస్సాం రాష్ట్రం కేంద్రబలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇక గౌహతిలో పర్యటించాల్సి ఉన్న జపాన్ ప్రధాని ఆందోళనల కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంగ్లాదేశ్ మంత్రులు కూడా భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు.
Two things should never be lost sight of in the present atmosphere of controversy.
— Tathagata Roy (@tathagata2) December 13, 2019
1. The country was once divided in the name of religion.
2. A democracy is NECESSARILY DIVISIVE. If you don’t want it go to North Korea.