షాకింగ్ వీడియో: పాకిస్తాన్ వెళ్లిపోండి.. ముస్లింలపై మీరట్ ఎస్పీ చిందులు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటిదాకా సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోగా .. అందులో 21 మంది ఉత్తరప్రదేశ్ కు చెందినవాళ్లేకావడం చర్చనీయాంశమైంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నా.. యూపీలో మాత్రం పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. చనిపోయిన 21 మందీ పోలీస్ ఫైరింగ్ లోనే బలయ్యారన్న కుటుంబీకులు, స్థానికుల వాదనను పోలీసుల శాఖ, ప్రభుత్వం తోసిపుచ్చింది. యూపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ.. మీరట్ అర్బన్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఒకటి దుమారం రేపుతున్నది.
BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !
ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు
‘‘రేయ్.. లం..కొడకల్లారా.. నాతోనే పెట్టుకుంటారా? మీలో ఒక్కణ్ని కూడా విడిచిపెట్టను.. ఈ గల్లీ మొత్తాన్ని తొక్కిపారేస్తా.. ఇంటికొకణ్ని తీసుకొచ్చి బొక్కలో తోసేస్తా.. ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే పాకిస్తాన్ వెళ్లిపోండి.. ఇక్కడి తిండి తింటూ, పక్కదేశాన్ని పొగడటానికి సిగ్గులేదా?'' అంటూ ముస్లింల ఏరియాలో నిలబడి మీరట్ అర్బన్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ సింగ్ చేసిన వ్యాఖ్యలివి. ఈనెల 20న మీరట్ లోని లిసారీ గేటు దగ్గర ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.
అవును.. నేనన్నదాంట్లో తప్పేముంది?
సీఏఏ నిరసనల ముసుగులో కొందరు హింసకు పాల్పడ్డారని, వాళ్లను కంట్రోల్ చెయ్యడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన(వీడియోలోని సీన్లు) చోటుచేసుకున్నాయని ఎస్పీ అఖిలేశ్ సింగ్ వివరణ ఇచ్చారు. ‘‘నిరసనకారులు మాపై రాళ్లు విసురుతూ, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశాన్ని తిడితే ఏ పోలీసుకైనా రోషమొస్తుంది. నేను కూడా ఆ కోపంలోనే ‘పాకిస్తాన్ వెళ్లిపోండి'అని అన్నాను. నేనన్నదాంట్లో తప్పులేదని అనుకుంటున్నా‘‘అని సింగ్ చెప్పుకొచ్చారు.
ఒక్కొక్కడికి వణుకుపుట్టాలి: యోగి ఆఫీస్ ట్వీట్
సీఏఏ నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. ఆందోళనల్లో హింసకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపడంలో తప్పులేదని, హాని తలపెట్టాలనే చూసే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక కార్యాలయం ట్వీట్ చేసింది. యోగి చర్యల తర్వాత నిరసనకారులు షాక్ అవుతున్నారని.. కఠిన చర్యలకు భయపడి వారంతా సైలెంట్ అయిపోయారని పేర్కొంది.