దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్! చర్చ్ లకు పటిష్ట భద్రత! రంగంలో సీఐఎస్ఎఫ్ బలగాలు
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం ప్రభావం మనదేశంపై పడింది. మనదేశంలోనూ చర్చిలపై దాడులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రత్యేకించి- దక్షిణాదిన క్రైస్తవ సామాజిక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించే రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు జరగొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి ఉప్పందించాయి. దీనితో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో..క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలంటూ సూచనలు జారీ చేసింది.
చర్చ్ ల వద్ద గట్టి బందోబస్తు..
దీన్ని దృష్టిలో ఉంచుకుని గోవా, తమిళనాడుల్లో హై అలర్ట్ ప్రకటించారు. గోవా సహా తమిళనాడులో తీర ప్రాంత జిల్లాలైన తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్టణం, కడలూర్ లల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. శ్రీలంక నుంచి సముద్రమార్గం గుండా తమిళనాడు, గోవా తీర ప్రాంతాలకు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈస్టర్ సండే సందర్భంగా శ్రీలంకలో ఆత్మాహూతి దళ సభ్యులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 290 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఆత్మాహూతి దళ సభ్యులు శ్రీలంక నుంచి సముద్ర మార్గం గుండా తమిళనాడు, గోవాలకు చేరుకోవచ్చని, ఈ రెండు రాష్ట్రాల్లో దాడులకు పాల్పడటానికి అవకాశాలు లేకపోలేదంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
ప్రమోద్ సావంత్
ఈ సమాచారం అందుకున్న వెంటనే-గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. గోవా, డయ్యూ, డామన్ లల్లో క్రైస్తవ సామాజిక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. రాజధాని పనాజీ సహా అన్ని ప్రాంతాల్లో చర్చ్ల వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశించారు. గోవా సహా కేంద్ర పాలిత ప్రాంతాలైన డయ్యూ, డామన్ లల్లోని చర్చ్ ల వద్ద అదనపు భద్రతను కల్పించారు. దీనికోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలను రంగంలోకి దించారు. అత్యంత ప్రాచీనమైన సెయింట్ బసీలికా చర్చ్ సహా అన్ని ప్రధాన ప్రార్థనా స్థలాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
గోవా, డామన్ చర్చ్ ల ఆర్చి బిషప్ లతో డీజీపీ ప్రణబ్ నందా ఫోనులో సంభాషించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. గోవాలో ఎలాంటి పేలుళ్లు జరగకుండా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలను అప్రమత్తం చేశారు. విదేశీ పర్యాటకులు ఎక్కువగా పర్యటిస్తున్న గోవా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాడులకు దిగే అవకాశముందని నిఘావర్గాలు చేసిన హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వెయ్యిమందికి పైగా పారామిలటరీ బలగాలను మోహరించారు.
తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు అప్రమత్తం..
తమిళనాడులో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న తూత్తుకుడి, నాగపట్టణం, రామనాథపురం, కడలూర్ జిల్లాల్లోని తీర ప్రాంతాల వద్ద భద్రతను పెంచారు. తీర ప్రాంత భద్రత బలగాలను మోహరింపజేశారు. శ్రీలంక నుంచి ఆత్మాహూతిదళ సభ్యులు సముద్రమార్గం గుండా తమిళనాడుకు చేరుకోవచ్చంటూ సంకేతాలు అందడంతో ఆయా జిల్లాల పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో వెంబడి నిర్మించిన చర్చ్ లకు భారీ బందోబస్తును కల్పించారు. విస్తృతంగా సోదాలను చేపట్టారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనుమానిత వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో బైకులు, కార్ల వంటి వాహనాలను పేల్చేయడం ద్వారా ఉగ్రవాదులుదాడులకు పాల్పడవచ్చంటూ సమాచారం రావడం వల్ల అలాంటి వస్తువులపై నిఘా వేసి ఉంచాలని అన్నారు.