కేజ్రీ ఎన్నికల నినాదం ఓట్లు రాల్చేనా - దీదీ వ్యూహాలు కలిసొచ్చేనా :గోవాలో ముందస్తు ప్రచారం..!!
గోవాలో త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక వైపు నుంచి ఆప్ ... మరో వైపు..టీఎంసీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ సారి ఆప్ పంజాబ్ తో పాటుగా గోవాలోనూ ప్రత్యేకంగా రాజకీయ వ్యూహం సిద్దం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇప్పటికే ప్రకటించింది. సాధ్యమైనన్ని రోజులు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ప్రచారంలో పాల్గొనేలా కేజ్రీవాల్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ తో పాటుగా గోవాలోనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
గోవాలో ప్రధానంగా నిరుద్యోగుల ఓట్ల పైన కేజ్రీవాల్ గురి పెట్టారు. గోవా యువకులకు ఉద్యోగాలు లభించలేదన్న ఆయన..దాని పైనే చర్చలు చేస్తున్నారు. గోవాలో నిరుద్యోగుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిందన్నారు. గోవాలో డబ్బు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతున్నాయంటూ అధికార బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగ సమస్య అజెండాతో గోవా అసెంబ్లీ ఎన్నికలను ఆప్ ఎదుర్కోబోతున్నట్లు కేజ్రీవాల్ పరోక్షంగా వెల్లడించారు. మరో వైపు గోవాలో సత్తా చాటాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అప్పుడే తన వ్యూహాలు అమలు చేస్తున్నారు.
గోవా మాజీ సీఎం లుయిజినో ఫలేయిరో ను పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసారు. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. గోవా ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడ పర్యటించారు. గోవాలో తదుపరి ప్రభుత్వం తమదేనంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు.
ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఎంసీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లే నరేంద్ర మోడీ బలపడుతున్నారని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగానే సెప్టెంబర్ 29వ తేదీన ఫలేయిరో కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరారు. ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవిని కూడా టీఎంసీ అప్పగించింది. ఇక, డిసెంబర్ 1 మహారాష్ట్ర పర్యటనకు రానున్న మమతా బెనర్జీ గోవా లో పర్యటన షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అదే విధంగా కేజ్రీవాల్ సైతం ఇక్కడ యువత ఓట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.