పారికర్ వారసుడు గట్టెక్కాడు : గోవాలో బలం నిరూపించుకున్న బీజేపీ
పనాజీ: అనుకోని ఘటనలేవీ చోటు చేసుకోలేదు. అనూహ్య ఫలితాలే రాలేదు. ఊహించినట్టే.. గోవా అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. బల పరీక్షలో అయిదు ఓట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తం 40 మంది శాసన సభ్యుల బలం ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 20, కాంగ్రెస్ కు 15 ఓట్లు పోల్ అయ్యాయి. మూజువాణి ఓటు ద్వారా బలపరీక్ష పూర్తయింది. గెలుపు ఆంతర్యం అయిదు ఓట్లు కావడంతో బీజేపీ ప్రభుత్వానికి ఇక ఎలాంటి ఢోకా లేనట్టే.
బుధవారం ఉదయం 11:30 గంటలకు గోవా శాసనసభ సమావేశమైంది. ముఖ్యమంత్రి కోసం కేటాయించిన కుర్చీలో ఆసీనులయ్యారు. ఇటీవలే కన్నుమూసిన ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కు సంతాపాన్ని వ్యక్తం చేశారు సభ్యులు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కంటతడి పెట్టారు. సీనియర్ సభ్యుడు మైఖెల్ లోబో స్పీకర్ గా వ్యవహరించారు. ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఖాళీ అయిన స్పీకర్ స్థానాన్ని లోబో భర్తీ చేశారు. 12:59 నిమిషాలకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. బల పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్
ప్రమోద్కు అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వారిలో బీజేపీ-11, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ-3, గోవా ఫార్వర్డ్ పార్టీ-3, స్వతంత్ర సభ్యులు-3 ఉన్నారు. 14 మంది కాంగ్రెస్ సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒకరు బల పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేశారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యుల బలం ఉండగా.. నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. మనోహర్ పారిక్కర్ సహా ఇద్దరు సభ్యులు కన్నుమూశారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. నిజానికి- తమకు 21 మంది సభ్యుల బలం ఉందని.. కాంగ్రెస్ ప్రకటించుకుంది. చివరికి- కాంగ్రెస్ కు ఉన్న బలం 15 మాత్రమేనని స్పష్టమైంది.