క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 63. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ఏడాదికి పైగా పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పనాజీలోని తన కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. అంతకుముందే, ఆయన ఆరోగ్యం బాగాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ఆరోగ్యం విషమమని తెలిసిన కాసేపట్లోనే
అంతకుముందు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని సీఎం కార్యాలయం ఆదివారం సాయంత్రం తెలిపింది. డాక్టర్లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గోవా సీఎంవో ట్వీట్ చేసింది. ఆ తర్వాత కాసేపటికే కన్నుమూశారు. మనోహర్ పారికర్ క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల క్రితం అమెరికాలో చికిత్స పొందారు. ఢిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబైలలోను చికిత్స తీసుకున్నారు. గత నెలలో మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
గత ఏడాదికి పైగా పారికర్ ఆరోగ్యం బాగా లేదు. ఇటీవల చికిత్స అనంతరం కోలుకున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పారికర్ ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలో గోవా బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీ అధిష్టానంతో మాట్లాడారు.
అలాగే, పనాజీలో బీజేపీ గోవా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వినయ్ టెండుల్కర్ నేతృత్వంలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు, పారికర్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. శనివారం కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం గవర్నర్ను కలిసింది.
ఆదివారం సాయంత్రం గోవా ప్రతిపక్ష నేత (కాంగ్రెస్) చంద్రకాంత్ కావ్లేకర్ గవర్నర్ మృదుల సిన్హాకు ఓ విజ్ఞప్తి చేశారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నారు.
ఈ మేరకు ఆయన గవర్నర్కు లేఖ రాశారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే డిసౌజా మృతి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం బలం తగ్గిందని, అలాగే, మనోహర్ పారికర్ ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయిందని పేర్కొన్నారు.
గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే డిసౌజా మృతి చెందారు. దీంతో సభలో బలం 39కి చేరుకుంది. సుభాష్ షిరోద్కర్, దయానంద్ సోప్తే అనే ఇద్దరు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. దీంతో గోవాలో ఇప్పుడు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 14 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలిచింది. కానీ సుభాష్ షిరోద్కర్, దయానంద్ సోప్తేలు బీజేపీలో చేరారు. బీజేపీకి 13 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక గోవా ఫార్వార్డ్ పార్టీకి ముగ్గురు, ఎంజీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. ఎన్సీపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో మొత్తం 37 మంది ఉన్నారు.