కుటుంబం, రాజకీయాలు, ఆరెస్సెస్: ఎమ్మెల్యే అయిన తొలి ఐఐటియన్, ఎవరీ మనోహర్ పారికర్?
పనాజీ: గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అతి సామాన్య 'ముఖ్యమంత్రి'గా పేరు తెచ్చుకున్నారు. పెద్దగా సెక్యూరిటీ లేకుండా, హవాయి చెప్పులతో, ఎలాంటి మందీమార్భలం లేకుండా ఎక్కడికైనా వెళ్తారనే పేరు ఉంది. ఎవరైనా కనిపిస్తే ఆగి మరీ వారు యోగక్షేమాలు తెలుసుకుంటారు.
సామాన్యుడి, నిజాయితీపరుడు పారికర్
మనోహర్ పారికర్ ఐఐటీలో విద్యాభ్యాసం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గోవా సామాన్యుడిగా ప్రజల్లో పేరు పొందారు. రాజకీయ నాయకుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తారు. గోవాకు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గోవాలో బీజేపీని బలోపేతం చేశారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి నేతల కోరిక మేరకు తిరిగి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవా వంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన మనోహర్ పారికర్.. దేశ రక్షణ శాఖ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. భద్రతా దళాల సంరక్షణకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
ఐఐటీ చదివి....
మనోహర్ పారికర్ పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ పారికర్. 1955 డిసెంబర్ 13వ తేదీన గోవాలోని మపుసాలో జన్మించారు. ఐఐటీ విద్యను అభ్యసించారు. ఐఐటీ (పూర్వ ఐఐటీ విద్యార్థిగా) చేసి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ప్రథముుడు పారికర్. ఐఐటీ బాంబేలో చదివారు. అతను తన సెకండరీ విద్యను మరాఠీలో పూర్తి చదివారు. ఇండియాలో ఐఐటీ చదివి ఎమ్మెల్యే అయిన మొదటి వ్యక్తి పారికర్. ఆ తర్వాత సీఎం అయ్యారు. అతనికి ఐఐటీ బాంబే విశిష్ట పూర్వ అవార్డును కూడా ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం అసహనం తెరపైకి వచ్చిన సమయంలో ఆ సమయంలో నటుడు అమీర్ ఖాన్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై పారికర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్కు వెళ్తే నరకానికి వెళ్లినట్లేనని గతంలో వ్యాఖ్యానించారు.
పారికర్ ఫ్యామిలీ
మనోహర్ పారికర్ సతీమణి మేధా. ఆమె 2001లో మృతి చెందారు. పారికర్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ఉత్పల్, అభిజిత్. ఉత్పల్ మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ చేశారు. అభిజిత్ స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నారు.
ఆరెస్సెస్ ద్వారా ఎదిగిన పారికర్
పారికర్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్లో చేరారు. ముఖ్య శిక్షక్గా పని చేశారు. అతను తమ ప్రాంతంలో ప్రయివేటు వ్యాపారం చేసేవారు. అదే సమయంలో 26 ఏళ్లకు ఆరెస్సెస్ సంఘ్చాలక్ అయ్యారు. నార్త్ గోవా యూనిట్ ఆరెస్సెస్లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేవారు. రామ జన్మభూమి ఉద్యమానికి పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. సామాన్యుల సీఎంగా పేరు గాంచారు. బ్రెజిల్లో జరిగిన 2014 ఫిఫా ప్రపంచ కప్ల కోసం ఆరుగురు ఎమ్మెల్యేలకు రూ.89 లక్షలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.
పారికర్ రాజకీయ జీవితం
పారికర్ 1994లో తొలిసారి గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2000 అక్టోబర్ 24వ తేదీన తొలిసారి గోవా సీఎం అయ్యారు. 2002 జూన్ 5న మరోసారి సీఎంగా అయ్యారు. 2005లో జనవరిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పారికర్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. కానీ ఆయన నెట్టుకొచ్చారు. 2007లో కాంగ్రెస్ గెలిచింది. 2012లో మళ్లీ బీజేపీ గెలవడంతో పారికర్ సీఎం అయ్యారు. 2014లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయ్యారు. 2017లో తిరిగి గోవా సీఎం అయ్యారు. 2014 -2017 మధ్య ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
పారికర్ అనారోగ్యం
మనోహర్ పారికర్ క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్నారని 27 అక్టోబర్ 2018న ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా, ముంబై తదితర చోట్ల చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ రోజు (17 మార్చి 2019) ఆయన తుది శ్వాస విడిచారు. పారికర్ మృతిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.