గోవా తదుపరి సీఎంపై బీజేపీలో చర్చ...చికిత్స కోసం ఢిల్లీకి మనోహర్ పారికర్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాక ప్రత్యేక విమానంలో మనోహర్ పారికర్ను ఎయిమ్స్కు తరలించారు. సెప్టెంబర్ 6వ తేదీనే అమెరికాలో చికిత్స పొందిన అనంతరం పారికర్ గోవా చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తిరిగి కండోలిమ్ గ్రామంలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు .ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్ కొన్ని నెలల పాటు అమెరికాలో చికిత్స పొందారు.
మెరుగైన చికిత్స కోసం అమెరికాకు గోవా సీఎం పారికర్
ప్రస్తుతం సీఎం పారికర్ ఆరోగ్యపరిస్థితి బాగాలేదని అంతా మంచే జరగాలని కోరుకుందామని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. ఢిల్లీకి బయలు దేరి వెళ్లకముందు పారికర్ను చాలామంది ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ఇదిలా ఉంటే తన ఆరోగ్యకారణాల దృష్ట్యా పారికర్ సీఎం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని బీజేపీ తెలిపింది. ఇందుకోసం బీజేపీ గోవా రాష్ట్రానికి దూతలను పంపింది. చాలా పోర్ట్ ఫోలియోలు పారికర్ వద్దే ఉన్నందున పాలనాపరమైన విధానాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అధిష్టానం భావించింది. దీంతో పారికర్ మిత్రపక్షాల నేతలను కలిశారు.
ఇదిలా ఉంటే పారికర్ రాజీనామా చేస్తే గోవా ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర వాడి గోమంతక్ పార్టీ అధినేత సుదిన్ ధావ్లికర్ సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఆయన ఎంపికపై గోవా ఫార్వర్డ్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని పారికర్కు తెలిపింది. మరోవైపు పారికర్ సీఎంగానే కొనసాగుతారని అయితే అతని వద్ద ఉన్న పోర్ట్ ఫోలియోలను ఇతర మంత్రులకు కేటాయిస్తారని దీనివల్ల పాలన కు ఎలాంటి ఇబ్బంది కలగబోదని లోబో తెలిపారు.