గోవా కొత్త ముఖ్యమంత్రి: లక్ష్మీకాంత్ ఎవరీ పర్సేకర్?
పానాజి: మనోహర్ పారికర్ మంత్రివర్గంలో గోవా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మీకాంత్ వై. పర్సేకర్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులవుతున్నారు. ఆయన 1956 జులై 4వ తేదీన హర్మాల్లో జన్మించారు. బిఇడి పూర్తి చేసిన పర్సేకర్ హర్మాల్ పంచక్రోసి మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు.
బిజెపి రాష్ట్ర శాఖలో ఆయన పలు పదవులు నిర్వహించారు. 2002 జూన్లో గోవా శానససభకు ఎన్నికయ్యారు. మరోసారి 2007 జూన్లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1989 - 1990 మధ్య కాలంలో ఆయన బిజెపి రాష్ట్రా కార్యదర్శిగా పనిచేశారు.
2002, 2003 మధ్య, 2010, 2012 మధ్య పర్సేకర్ గోవా బిజెపి శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయనకు కొంకణి, మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రవేశం ఉంది. ముఖ్యమంత్రి పదవికి లక్ష్మీకాంత్ పర్సేకర్తో పాటు గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ పోటీ పడ్డారు.
తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని డిసౌజా హెచ్చరించారు. అయినా బిజెపి నాయకత్వం వెనక్కి తగ్గకుండా పర్సేకర్ను శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేసింది. మనోహర్ పారికర్ కేంద్రంలో మంత్రి పదవి చేపట్టడానికి గాను గోవా ముఖ్యమంత్రి పదవికి శనివారంనాడు రాజీనామా చేశారు. పారికర్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని చెబుతున్నారు.