‘స్వచ్ఛ భారత్’పై పాట రాసిన మహిళా గవర్నర్
పనాజీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా తనవంతు కృషి చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఆమె ఓ పాటను రాశారు. అంతేగాక, ఓ కార్యక్రమంలో ఆమె తన పాటను ఆలపించారు.
కాగా, ఇప్పుడు ఆ పాటలోని కొన్ని నినాదాలను తీసుకుని గోవా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు. ఈ పాటలో పరిశుభ్రతకు సంబంధించి నినాదాలతో పాటూ విద్యార్థులతో చేయించే ప్రతిజ్ఞ కూడా ఉంది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను ఈ పాటలో వివరించారు. పరిశుభ్రంగా ఉండటానికి 'ఏం చేయాలి', 'ఏం చేయకూడదు' లాంటి అంశాలను అందులో ప్రస్తావించారు. పనాజీ, మపుసా, పాండా, మార్గోవా, విస్కోలను స్వచ్చ నగరాలుగా తయారు చేసేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులకు గవర్నర్ పలు సూచనలు చేశారు.
గవర్నర్ సిన్హా.. 17నెలలుగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపి, స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన వారిలో మృదులా సిన్హా కూడా ఉన్నారు.