కన్నడిగులు నీచులు, గోవా మంత్రి: బీజేపీకి తలనొప్పి, మాగడ్డ మీద అడుగుపెట్టి !
బెంగళూరు: కన్నడిగులు నీచులు, అందుకే పోలీసు బందోబస్తు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా నీటిపారుదల శాఖ మంత్రి వినోద్ పాలీకర్ వెంటనే కన్నడిగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతమైన మంత్రి స్థానంలో ఉన్న వినోద్ పాలీకర్ కన్నడిగులను కించపరస్తూ దారుణంగా మాట్లాడారని మండిపడుతున్నారు. గోవా మంత్రి వ్యాఖ్యలతో బీజేపీకి తలనొప్పి ఎదురైయ్యింది.
బెళగావికి గోవా మంత్రి
కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపుర తాలుకాలో జరుగుతున్న కళసా నాలా (కళసా కాలువ) పనులు పరిశీలించడానికి గోవా మంత్రి వినోద్ పాలీకర్ వెళ్లారు. మంత్రి వెంట పోలీసులు భారీ బందోబస్తుగా వెళ్లారు. బెళగావి జిల్లాలో కళసా కాలువ పనులు పరిశీలించిన మంత్రి తిరిగి గోవా వెళ్లిపోయారు.
కన్నడిగులు నీచులు
గోవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి వినోద్ పాలీకర్ కర్ణాటక ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బెళగావి జిల్లా పర్యటన సందర్బంగా అంత భారీ బందోబస్తు మీకు అవసరమా అని వీలేకరులు ప్రశ్నించగా కన్నడిగులు నీచులు, క్రూరులు అందకే పోలీసు బందోబస్తుతో వెళ్లానని మంత్రి వినోద్ పాలీకర్ సమాధానం ఇచ్చారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖార్గే మీడియాతో మాట్లాడుతూ మహాదాయి నీటి పంపిణి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని, సమస్య పరిక్షరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంలో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ సోమవారం కళాస కాలువ పనులు పరిశీలించడానికి వెళ్లారు.
గోవా మీద కక్షలేదు
గోవా నీటిపారుదల శాఖ మంత్రి వినోద్ పాలీకర్ వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో ఖండించారు. గోవా ప్రజల మీద తనకు ఎలాంటి ద్వేషం లేదని, కన్నడిగులను ఇలా అవహేలనగా మాట్లాడటం చాలా ఆవేదన కలిగించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్వీట్ చేశారు.
కర్ణాటకకు రావడం నేరం
గోవా మంత్రి వినోద్ పాలీకర్ కర్ణాటకలో అడుగు పెట్టడం మొదటి నేరం, ఆయన నీచమైన బాష ఉపయోగించారు, వెంటనే కన్నడిగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కన్నడ చళవలి వాటల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
ఎవరికి లాభం ?
గోవా మంత్రి (బీజేపీ) వినోద్ పాలీకర్ వ్యాఖ్యలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఖండించారు. రెండు రాష్ట్రాల మధ్య భాంధ్యవ్యాన్ని దెబ్బ తీసేవిధంగా గోవా మంత్రి వినోద్ పాలీకర్ మాట్లాడారని, ఇలాంటి వ్యాఖ్యల వలన ఎవరికీ లాభం లేదని బీఎస్. యడ్యూరప్ప చెప్పారు.
ఏం తెలుసు ?
కన్నడిగులు చాలా మంచివారు. నీటి పంపిణి విషయంలో కన్నడిగులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి, మంత్రి స్థానంలో ఉన్న వినోద్ పాలీకర్ వెంటనే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి డిమాండ్ చేశారు.
మా పార్టీ నేత మూర్ఖుడు
గోవా మంత్రి వినోద్ పాలీకర్ మూర్ఖుడు, అందుకే కన్నడిగులను ఇలా మాట్లాడారని సొంతపార్టీ నేత, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, విధానపరిషత్ లో ప్రతిపక్ష నాయుడు కేఎస్. ఈశ్వరప్ప మండిపడ్డారు. మా పార్టీ నాయకుడు అయినా సరే ఇలా మాట్లాడటం పద్దతికాదని ఈశ్వరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.
మా ఇంటికి వచ్చి ?
మానేల మీద అడుగుపెట్టి మమ్మల్నే కించపరిచే విధంగా మాట్లాడుతావా, ఎంత ధైర్యం, వెంటనే కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ మండిపడ్డారు. కన్నడిగులను అవమానించి మాట్లాడిన బీజేపీ నాయకుడికి కన్నడిగులు సరైన సమాధానం చెబుతారని ఎంబీ. పాటిల్ హెచ్చరించారు.