బంపర్ ఆఫర్: గోఎయిర్ టికెట్ వెయ్యి రూపాయలే...!
ముంబై: ప్రముఖ బడ్జెట్ విమానాయాన సంస్థ గోఎయిర్ తమ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 10 లక్షల సీట్లను అత్యల్ప ధర రూ.1099కే అది కూడా ఒక ట్రిప్కు మాత్రమే అందిస్తోంది. దీనితో పాటు డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం నుంచి టికెట్స్ బుక్ చేస్తే మరో 5శాతం డిస్కౌంట్ లభించనున్నట్లు గోఎయిర్ సంస్థ ప్రకటించింది. గోఎయార్ వెబ్సైట్ ద్వారా లేదా గోఎయిర్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ.3వేలు డిస్కౌంట్ లభిస్తుంది.
గోఎయిర్ ఆఫర్ తరుచూ విమాన ప్రయాణం చేసేవారికే కాదు ఎవరైనా తొలిసారిగా విమానం ఎక్కాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. శనివారం నుంచి టికెట్ సేల్స్ ను అందుబాటులో పెట్టనున్న గోఎయిర్ సంస్థ.... ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు చివరి తేదీ ఆగష్టు 9 అని తెలిపింది. ప్రయాణికులు ఆగష్టు 4 నుంచి డిసెంబర్ నెలలోపు ప్రయాణించాలని సంస్థ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రయాణికులను అట్రాక్ట్ చేసేందుకు పలు విమానాయాన సంస్థలు ఎప్పటికప్పుడు భారీ ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి.
గత నెలలో 12 లక్షల సీట్లను రూ. 1212కే అమ్మకానికి ఉంచింది మరో విమానాయాన సంస్థ ఇండిగో. అయితే ఇది కేవలం దేశీయ ప్రయాణాలకే కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా పరిమితం చేసింది. గోఎయిర్ ఆఫర్ పై బాగానే స్పందన వస్తోందని ఆ సంస్థ తెలిపింది. పేటీఎం ద్వారా బుక్ చేసుకుంటే రూ.250 క్యాష్ బ్యాక్ రావడంతో పాటు టికెట్ పై డిస్కౌంట్ రూ.1100 లేదా 20 శాతం ఏది తక్కువైతే అది అప్లై అవుతుందని వివరించింది. వాడియా గ్రూప్కు చెందిన గోఎయిర్ విమానాయాన సంస్థ దేశంలోని 23 ప్రాంతాలకు తమ విమానాలను నడుపుతోంది.